నిజామాబాద్, డిసెంబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను హత్య చేశారు. భూంపల్లి శివారులో చంపేసి పెట్రోల్ పోసి నిప్పటించారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఒక హత్యతో మరో హత్యకు సంబంధించిన లింకు దొరకడంతో హుటాహుటిన కామారెడ్డి పోలీసులు చూపించిన చొరవతో హంతకుల ప్లాన్ను చివరి దశలో నిలువరించగలిగారు. ఆరు హత్యలు చేసిన నిందితులు ప్రసాద్ తల్లి సుశీలను సైతం చంపాలని చూశారు. కానీ పోలీసుల రంగప్రవేశంతో నిలువరించగలిగారు.
డిసెంబర్ 13 ఘటనతో హత్యాకాండ వెలుగు చూడగా అంతకు ముందే నిజామాబాద్ జిల్లా మెండోరా మండల శివారులో నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దులోనూ ఇలాంటిదే వెలుగు చూసింది. డిసెంబర్ 4న నిజామాబాద్కు ప్రసాద్ పిల్లలను హంతకుడు మేడిద ప్రశాంత్, అతని తమ్ముడు కలిసి బయటికి పట్టుకొచ్చారు. కిరాయి తీసుకున్న కారులో ఎక్కించుకుని సోన్ బ్రిడ్జి వద్దకు వచ్చారు. కవల పిల్లలైన చైత్రిక, చైత్రిక్లను చంపేసి వంతెనపై నుంచి కింద పడేశారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో హత్య ఘటన ఆలస్యంగా డిసెంబర్ 8న పోలీసులకు తెలిసింది. గుర్తు పట్టరాని విధంగా మారిన మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసుల వైపే శోధన జరిపారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కానీ వీరికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒక వేళ మెండోరా పోలీసులు ఇతరత్రా మార్గాలను అన్వేషించి అప్రమత్తమై ఉండి ఉంటే డిసెంబర్ 13న జరగాల్సిన స్వప్న హత్యను నిలువరించే పరిస్థితి ఉండేదని మాక్లూర్ వాసులు భావిస్తున్నారు.