కామారెడ్డి, ఏప్రిల్ 16 : గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెగ్యులర్గా పన్నుకట్టే వారికి మున్సిపల్ శాఖ రాయితీలు కల్పించింది. దీంతో గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే వారికి ఐదు శాతం రిబేటు కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతోపాటు పన్నులతో సమకూరిన డబ్బులను అభివృద్ధికి వినియోగిస్తారు. పన్నుల బకాయిలు పెరిగిపోకుండా మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏటా పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రకటించడంతో అధికారులు మరింత శ్రద్ధపెట్టారు. కామారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. కామారెడ్డి పట్టణ పరిధిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 65 లక్షలకు పైగా పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు.
రాయితీపై విస్తృతంగా ప్రచారం..
పన్నుల వసూలుకు మున్సిపల్ శాఖ ప్రకటించిన రిబేటుపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పన్నును వసూలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం ఇండ్ల వద్ద చెత్త సేకరణ కోసం వెళ్లే వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, బిల్ కలెక్టర్లు కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి పన్నులు చెల్లించే విధంగా రాయితీపై అవగాహన కల్పిస్తున్నారు. 5 శాతం రాయితీతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించేలా పట్టణవాసులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెలాఖరు వరకు ఉందని, ప్రజలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది పన్నుల వసూలుపై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆస్తులు, నల్లాలు, ప్రకటనలు తదితర పన్నులను వసూలు చేస్తున్నారు.
ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నందున డిజిటల్ పేమెంట్లు కూడా పెరిగిపోయాయి. చాలా మంది ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి పన్నులను సైతం ఆన్లైన్లో చెల్లించేందుకు మున్సిపల్ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అనేక సేవలు ఆన్లైన్ విధానంలో అందుతున్నాయి. పన్నుల చెల్లింపునకు కుడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వినియోగదారులకు ఇది మరింత సులువుగా మారింది. ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా పన్నుల చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
2022-23లో వందశాతం బకాయిలు వసూలు..
ప్రభుత్వానికి పన్నులు చెల్లించే విషయంలో చాలా మంది అలసత్వం ప్రదర్శిస్తుంటారు. దీంతో ఏటా మొండి బకాయిలు పెరుగుతుంటాయి. ఇది అభివృద్ధి, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ శాఖ నాలుగేండ్ల క్రితం ఎర్లీబర్డ్ స్కీం పేరిట సరికొత్త ఆలోచనలో ముందుకు వచ్చింది. మొండి బకాయిలు చెల్లిస్తే వడ్డీ రాయితీ, ముందస్తుగా పన్ను కడితే రిబేటును ప్రకటించింది. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు కనిపించాయి. కామారెడ్డి పట్టణ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీ ప్రకటించి వంద శాతం పన్నులను వసూలు చేశారు. అప్పటి నుంచి ప్రజలు సకాలంలో పన్నులు కట్టేలా వివిధ ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సైతం ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం సబ్సిడీని ఇస్తున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు విధించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
పన్ను బకాయిలు పెరిగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముందస్తుగా పన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీని ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి