కామారెడ్డి, జనవరి 6 : కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 67వ జాతీయ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ అండర్ 17 కబడ్డీ పోటీలకు కామారెడ్డి జిల్లా కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 7(ఆదివారం) నుంచి 11వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో దేశంలోని 28 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కేంద్రంలో 15 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పోటీలను విజయవంతం చేయాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జాతీయస్థాయి పోటీలను నిర్వహించనున్నది. మొదటి సారిగా కామారెడ్డి జిల్లా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆతిథ్యం ఇస్తూ ప్రాతినిథ్యం వహిస్తున్నది.
కబడ్డీ పోటీలకు సర్వంసిద్ధం..
కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నాలుగు కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ పోటీల నిర్వహణలో 67 మంది రిఫరీలు, 70 మంది టెక్నిషియన్లు, 100 మందికి పైగా ఆర్గనైజర్లు పోటీలను నిర్వహించనున్నారు. దేశంలో వివిధ రాష్ర్టాల నుంచి 28 జట్లకు సంబంధించి మొత్తం 450 మంది క్రీడాకారులు, కోచ్లు పాల్గొననున్నారు. క్రీడాకారులకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో వసతి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలను ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నారు.
మొదటి సారిగా జాతీయస్థాయి పోటీలు
ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి సారిగా కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించనున్నాం. ఈ పోటీల్లో దేశంలోని 28 రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎవరికీ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశాం.
– రాజు, డీఈవో