కామారెడ్డి, అక్టోబర్ 17 : వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు ఈ నెల చివరి వారంలో జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాల్లో వరిని పండించగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందన్నారు. అందుకనుగుణంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో 325, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలం 2023-24 ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులతో మంగళవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
కేంద్రాల్లో అవసరమైన తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లను సిద్ధం చేయాలని సూచించారు. గన్నీ సంచుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,203, ముతక రకానికి రూ.2,183 మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్వో మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జల సహకార అధికారి సంహాచలం, వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారి రమ్య, జిల్లా రవాణాధికారి వాణి, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రంలో ఫర్నిచర్ ఇతర వసతులను కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వచ్చే సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎన్నికల విభాగం అధికారి ప్రేమ్ కుమార్, అధికారులు ఇంద్ర ప్రియదర్శిని, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.