BJP | నిజామాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇంటింటికీ బీజేపీ పేరుతో జనంలోకి వెళ్తున్న కమలం పార్టీ నేతలకు ఊహించని షాక్ తగులుతున్నది. అడుగడుగునా ప్రజల నుంచి ప్రశ్నల పర్వం ఎదురవుతున్నది. తొమ్మిదేండ్లలో ఏం చేశారో చెప్పాలని జనం నిలదీస్తుంటే బిక్కమొహం వేయడం బీజేపీ నేతల వంతు అవుతున్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక నేలచూపులు చూస్తున్నారు. తొమ్మిదేండ్ల మోదీ పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో కాషాయ పార్టీ నాయకులు అసత్యాలు వల్లెవేస్తున్నారు. రాష్ట్ర పథకాలను తమవిగా చెప్పుకుంటూ జనం చెవిలో పూలు పెట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ ప్రజలు అడుగడుగునా నిలదీస్తుండడం, ఏ ఇంటికి వెళ్లినా ఇబ్బందికర పరిస్థితులు వెంటాడుతుండడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. కార్యక్రమం ప్రారంభమై రెండ్రోజులు కూడా కాక ముందే జనం నుంచి ఛీత్కారాలు ఎదురవుతుండడం బీజేపీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
‘మహా జన్ సంపర్క్ అభియాన్’లోభాగంగా గురువారం నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’ పేరిట చేపట్టిన కార్యక్రమంలో వింతధోరణులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ నేతలకు అడుగడుగునా చివాట్లు ఎదురవుతున్నాయి. ప్రజల వద్దకు వెళ్లాలని ప్రయత్నిస్తుండగా ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది పరిస్థితి. ఒకరిద్దరు నాయకులను వెంటేసుకుని బీజేపీ జిల్లా స్థాయి నాయకులంతా గురువారం నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రచారంలో వారికి కంగుతినే పరిస్థితి అడుగడుగునా ఎదువురవుతున్నది. ప్రచార పర్వంగా మారిన ఇంటింటికీ కార్యక్రమంలో ప్రజల చెంతకు వెళ్లేందుకు జంకే దుస్థితి కాషాయ నేతల్లో నెలకొన్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల నుంచి ఎదురవుతున్న సవాళ్లకు సరైన రీతిలో సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడుతున్నారు. ఎంతసేపు సోషల్ మీడియాలో అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేయడంపైనే ఆధారపడిన బీజేపీకి.. క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకుంటుండడంతో అసలు మర్మం అవగతమవుతున్నది.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోదీ సర్కారుపై ప్రజలంతా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇంటింటికీ బీజేపీ పేరుతో కాషాయ కండువాతో వస్తున్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నల వర్షంతో ప్రజలు కడిగి పారేస్తున్నారు. ప్రజలకు దీటుగా సమాధానం ఇవ్వలేక తప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇంటింటికీ కేసీఆర్ పథకాలు
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేపట్టి తొమ్మిదేండ్లు దాటింది. ఈ సుదీర్ఘ కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. నగర, గ్రామీణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన పెరిగింది. అధునాతన రీతిలో అభివృద్ధి కండ్ల ముందే సాక్షాత్కారమైంది. ఇంతటి అభివృద్ధికి సమానంగా పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం కొండంత అండగా నిలిచి పథకాలను అమలుచేస్తున్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి వారిని పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం, దోబీఘాట్ – సెలూన్లు, సాగుకు ఉచిత కరెంట్, పరిశ్రమలకు, గృహ అవసరాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అన్నది సాఫీగా జరుగుతున్నది. వందలాది పథకాల్లో ప్రతి ఇంటికీ కేసీఆర్ స్కీమ్ అందుతున్నది. కాని ఎక్కడా కూడా మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న, చేసినటువంటి పథకాలకు చెందిన లబ్ధిదారులు మచ్చుకూ కనిపించడం లేదు. సోషల్ మీడియాను నమ్ముకొని కల్పితాలను ప్రచారం చేసే బీజేపీ సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజల చెంతకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆశనిపాతంలా జనాల స్పందన ఉండడంతో ఎక్కిడికక్కడ కాషాయ నేతలకు కుంగుబాట్లు తప్పడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బలవంతంగా మిస్డ్కాల్స్
మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా బీజేపీ తలపెట్టిన ఇంటింటికీ బీజేపీలో పెడధోరణులు బయట పడుతున్నాయి. ఏదైనా రాజకీయ పార్టీ నిష్పక్షపాతం గా, నిజాయితీగా ప్రజల చెంతకు వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా అనైతికంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పరిపాలన విజయాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఒక నంబర్కు మిస్డ్ కాల్స్ రూపంలో మద్దతును కూడగట్టుకోవడం ఈ కార్యక్రమంలో మరో ఉద్దేశం దాగి ఉంది. అయితే బీజేపీ నేతలంతా బలవంతంగా ప్రజల ఫోన్లు తీసుకొని అధిష్టానం జారీ చేసిన నంబర్కు మిస్డ్ కాల్స్ ఇప్పిస్తున్నట్లు కనిపించింది. ఈ వ్యవహారంపై ప్రజలంతా బీజేపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిస్డ్ కాల్స్ వ్యవహారంలో బీజేపీ నేతలకు టార్గెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులంతా తమ కుటుంబీకులు, తెలిసిన వారి ఫోన్లతో మిస్డ్కాల్స్ ఇచ్చి పైశాచికత్వాన్ని పొందుతుండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ చేస్తున్న అసంబద్ధపు హడావుడిపై జనాలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. మోదీ పాలనలో తెలంగాణకు అడుగడుగునా మొండి చేయి ఎదురవుతున్నదని, నిధుల మంజూరులో వివక్ష తప్పడం లేదంటూ సామాన్య ప్రజానీకమే బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నారు. నరేంద్ర మోదీ ఏలుబడిపై ఇందూరు వాసులకు ఉన్న కనీస అవగాహన కూ డా బీజేపీ శ్రేణుల్లో లేకపోవడం విడ్డూరంగా మారింది.
కేసీఆర్ పథకాలనే తమవిగా ప్రచారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య నేతృత్వంలో నిజామాబాద్ నగరంలో పలు వీధుల్లో గురువారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. పట్టుమని పది మంది కూడా లేని బృందంతో కలిసి బస్వా పలు ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో ప్రజలకు బీజేపీ చేసిన మంచిని ఏ రకంగా వివరించాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. చేసేది లేక పింఛన్లు ఇచ్చేది మోదీనే అంటూ అసత్యాలను ప్రజలకు వివరించారు. కాగా ఇంధన ధరల పెరుగుదలకు కేసీఆరే కారణమంటూ పచ్చి అబద్ధాలను చెప్పడానికి యత్నించారు. ఇలా జిల్లా అధ్యక్షుడి బాటలోనే జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ నేతల తీరు ఇదే రకంగా కనిపించింది. కేంద్ర పథకాలతో ఒనగూరిన లాభాలేంటో చెప్పలేక బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నది. ఎంతసేపు మతం, దేశ భక్తి పేరిట భావోద్వాగాలపైనే ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం జరిగింది తప్ప, వాస్తవాలను ప్రజల చెంతకు తీసుకెళ్లే యత్నమే మచ్చుకూ కనిపించకపోవడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమవిగా బీజేపీ శ్రేణులు చెప్పుకునే స్థాయికి దిగజారిందంటూ పలువురు చివాట్లు పెడుతున్నారు. ఒకవేళ ఆయా పథకాల్లో కేంద్రం వాటా ఉన్నైట్లెతే వాటికి గల ఆధారాలేంటో చూపెట్టాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.