బాన్సువాడ/బీర్కూర్/బాన్సువాడ రూరల్, మార్చి 1 : తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన బుధవారం వివిధ కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభతో కలిసి కల్యాణమహోత్సవంలో పాల్గొన్నా రు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్తో కలిసి వచ్చారు. తాడ్కోల్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్ దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిమ్మాపూర్ ఆలయానికి బయల్దేరారు. ఆలయ అలిపిరి వద్ద పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా కారులో ఆలయానికి చేరుకున్నారు. దాతలు, భక్తులు సమర్పించిన 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని సీఎం కేసీఆర్ స్వామి వారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మిగోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం దంపతులు.. ముఖ్యమంత్రి దంపతులను పట్టు వస్ర్తాలతో సన్మానించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి ప్రతిమను స్పీకర్ పోచారం అందజేశారు.
కల్యాణంలో పాల్గొన్న పోచారం కుటుంబీకులు
బ్రహోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కుటుంబీకులు భక్తులతో కలిసి పాల్గొన్నారు. దేవానుజ రామానుజా చార్యులు రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. వేడుకలో స్పీకర్ దంపతులతో పాటు సోదరుడు పరిగె శంభురెడ్డి, ప్రేమల, కుమారులు డాక్టర్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి-సోనీరెడ్డి దంపతులు, స్పీకర్ అల్లుడు పరిగె వెంకట్రాం రెడ్డి, కుమార్తె అరుణ రెడ్డి, రాధ, వినోద్ రెడ్డి, సుష్మ దంపతులు, స్పీకర్ పోచారం వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, దొడ్ల మహేందర్ రెడ్డి, సంకీర్తన, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్ రావ్, అశోక్, అప్పారావ్ తదితరులు పాల్గొన్నారు.
దారిపొడవునా పూల వర్షం….
సీఎం కేసీఆర్కు బాన్సువాడలో ఘన స్వాగతం లభించింది. సీఎంకు స్వాగతం పలికేందుకు మహిళలు, యువకులు, విద్యార్థులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ తిమ్మాపూర్కు వెళ్లారు. తిరిగి 4.03 నిమిషాలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకొని 4.12 గంటలకు హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. దేశ్కి నేత కేసీఆర్, పోచారం శ్రీనన్న, భాస్కరన్న, సూరన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
మార్మోమోగిన గోవింద నామస్మరణ
కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయం గోవింద నామస్మరణతో మార్మోమోగింది. ఉద యం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆలరించిన గాన కచేరి..
తిరుమల బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాన కచేరి ఆకట్టుకున్నది. వెంకటరాజు పాడిన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు భక్తులను అలరించాయి. ఆలయానికి వచ్చిన భక్తులు, చిన్నారులు సైతం గాన కచేరిలో పాటలు పాడి ఆకట్టుకున్నారు.
10 వేల మందికి అన్నదానం..
బ్రహ్మోత్సవాలు, సీఎం సభ సందర్భంగా హాజరైన భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లు కేఆర్ సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్ , ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ , జుక్కల్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే , జాజాల సురేందర్, జీవన్ రెడ్డి, షకీల్, బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ రావు, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావ్, దఫేదార్ శోభారాజు, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, పరిగె శంభురెడ్డి, సుమిత్రానందన్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, వినోద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి, పెద్ద వెంకట్రామ్ రెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, పట్టణ సీఐ మహేందర్రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ రాజు, గంగాధర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత బాలకృష్ణ, పిట్ల శ్రీధర్, తాటి రాము గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం కేసీఆర్కు వినతులు వెల్లువెత్తాయి. తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండేతోపాటు జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ కోరారు. వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి.. సానుకూలంగా స్పందించి వాటిని జిల్లా మంత్రి ప్రశాంత్రెడ్డికి అప్పగించారు.