పేదింట పెండ్లి బాజాలు మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డల పెండ్లికి పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. ఆయా పథకాల అమలు కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఏకంగా 2 వేల కోట్లు కేటాయించి పేదలపై తమ ప్రేమను చాటుకున్నది. ఆడబిడ్డల పెండ్లిండ్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ కొండంత భరోసాగా నిలుస్తున్నారు. మేనమామ వలే పెళ్లికూతుళ్లకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఉమ్మడి జిల్లాలో వేలాది కుటుంబాలకు లబ్ధి జరిగింది. ఒక్క మోర్తాడ్ మండలంలోనే 1293 కుటుంబాలకు రూ.11.65 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.
మోర్తాడ్, ఏప్రిల్ 22: ఆడపిల్ల పెండ్లి చేయడం పేద కుటుంబాలకు తలకు మించిన భారంగా ఉండేది. కూతురు వివాహం చేసి అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోయిన వారెందరో.. ఆడపిల్ల వివాహం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. పేదింట్లో ఆడ పిల్ల పుడితే ఎందుకు పుట్టిందిరా అనుకునే వారూ కూడా చాలా మంది.. అలాంటి ఇబ్బందులను తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకుగాను ఆడపిల్లల పెండ్లిలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం చేసేలా పథకాన్ని రూపొందించారు. ఏండ్ల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడిన వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నది. అక్టోబర్ 2, 2014లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారు. మొదట 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా.. క్రమంగా పెంచుతూ ప్రస్తుతం రూ.1,00,116 అందజేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లను కేటాయించడం గమనార్హం.
మోర్తాడ్ మండలంలోనే 1293 మందికి లబ్ధి..
పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరగా.. ఒక్క మోర్తాడ్ మండలంలోనే 1293 మంది లబ్ధిపొందారు. ఇందులో 1132 మందికి కల్యాణలక్ష్మి, 161 మందికి షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా మండలానికి మొత్తం రూ.11.65 కోట్లను ప్రభుత్వం ఆడ పిల్లల తల్లిదండ్రులకు అందజేసింది. దోన్పాల్ గ్రామంలో 39 మందికి కల్యాణలక్ష్మి, దొన్కల్లో 82 మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీముబారక్, ధర్మోరాలో 75 మందికి కల్యాణలక్ష్మి, పాలెంలో 117మందికి కల్యాణలక్ష్మి, 11మందికి షాదీముబారక్, మోర్తాడ్లో 369 మందికి కల్యాణలక్ష్మి, 144 మందికి షాదీముబారక్, తిమ్మాపూర్లో 171మందికి కల్యాణలక్ష్మి, ఒకరికి షాదీముబారక్, శెట్పల్లిలో 105 మంది కి కల్యాణలక్ష్మి, ముగ్గురికి షాదీముబారక్, సుంకెట్లో 116మందికి కల్యాణలక్ష్మి, వడ్యాట్లో 58 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందాయి.
ఒకే కుటుంబంలో మూడు కల్యాణలక్ష్మి చెక్కులు..
పాలెం గ్రామానికి చెందిన ఇందూరి ఆంజనేయులు వృత్తిరీత్యా స్వర్ణకారుడు. అతడికి ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు కూతుళ్ల వివాహం చేయగా.. రెండో కూతురు అలేఖ్య, మూడో కూతురు అక్షిత, నాలుగో కూతురు అవంతికకు కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధి చేకూరింది. ఒకే కుం టుంబంలో మూడు కల్యాణలక్ష్మి చెక్కులు రావడం పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి తెలంగాణ సర్కారు ఏ విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నదో అర్థమవుతున్నది.
దయాల్సింగ్ కుటుంబీకులు 70 ఏండ్ల క్రితం పంజాబ్ నుంచి నిజామాబాద్కు వలస వచ్చా రు. అనంతరం 30 ఏండ్ల క్రితం మోర్తాడ్కు వచ్చారు. ఇక్కడ కూలీ పని చేయడంతో పాటు రొట్టె పెంకలను తయారు చేసి విక్రయించి జీవ నం సాగిస్తున్నారు. దయాల్సింగ్ ఏడాది క్రితం తన కుమార్తె గీతాకౌర్కు వివాహం చేశాడు. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభు త్వం రూ.1,00,116 మంజూరు చేసింది. అందుకు సంబంధించిన చెక్కును ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇటీవల అందజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధు లు లేకుండా పోయాయి.
బహుత్ అచ్చా లగా..
హమ్ తెలంగాణ ఆకే 70సాల్కే ఊపర్ హోగయా. మేరే బేటీ గీతాకౌర్కా షాదీ 2022మే కియాతా. ఇస్కే లియే హామే కల్యాణలక్ష్మికా ఏక్లాక్ రూపియాకా చెక్ మిలా, హమా రా పూరా ఫ్యామిలీకో బహుత్ అచ్చాలగా. పంజాబ్ కా గవర్నమెంట్ ఐసా స్కీం నహీ దేరయే. ఇదర్కా సీఎం కేసీఆర్ సాబ్ సబ్కా బళాకే లియే అచ్చా కర్హ్రాహై.
– దయాల్సింగ్, మోర్తాడ్
ఎంతో ఉపయోగపడుతున్నది..
ఆడ పిల్లలు ఉన్న పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రభుత్వం లక్ష రూపాయలను అందించడంతో పెండ్లికి ఆర్థిక భరోసా లభిస్తున్నది. నేను నా ముగ్గురు కూతుళ్ల పెండ్లిలు చేయగా.. మూడు కల్యాణలక్ష్మి చ్కులు వచ్చాయి. ఆ డబ్బులు పెండ్లికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్తోపాటు మంత్రి ప్రశాంత్రెడ్డికి రుణపడి ఉంటాం.
– ఇందూరి ఆంజనేయులు, పాలెం