కమ్మర్పల్లి/భీమ్గల్, ఆగస్టు 4: సరిగ్గా 20రోజుల క్రితం వానలు లేక బోసిపోయిన పంటలకు.. వట్టిపోయిన బోర్లకు.. ఎండిపోయిన వాగులకు ప్రాణం పోసిన కాళేశ్వర జలాలతో ఉన్న బంధాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. భగీరథ యత్నంతో గంగ భూమి మీదకు వచ్చినట్లు.. అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వర గంగమ్మను ఎదురెక్కించారు. వ్యతిరేక దిశలో జలాలను పారించి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. దక్కన్పీఠభూమిగా ఉన్న రాష్ర్టానికి గోదావరిని రివర్స్లో ఎదురెక్కించి తెలంగాణ నేలకు మళ్లించారు. రైతుల వరప్రదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు నేలలను తడపడానికి గోదారమ్మ ఉరుకులు, పరుగులతో తరలి వచ్చింది. సొరంగాలు, కాలువల్లో ప్రవహించి జలాశయాలకు జీవకళ తీసుకొచ్చింది. అంతేకాదు, వట్టిపోయిన వాగులకు ‘ప్యాకేజీ 21’ ద్వారా భరోసా కల్పించింది. ఇసుక దిబ్బల్లోనూ కాళేశ్వర గంగమ్మ ఉరుకులు పరుగులు తీసిన వైనాన్ని జిల్లా రైతాంగం కళ్లారా చూసింది. అద్భుత ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషిని రైతాంగం వేనోళ్ల కీర్తిస్తున్నది.
భారీ వర్షాలు కురిసి బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగు జోరుగా పారుతున్నాయి. కానీ ఈ వానలు కురువక ముందే ఈ వాగుల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కిన అద్భుతాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై రోజుల క్రితం వానలు లేవు వాగులు బోసిపోయి కనిపించిన చోటే కాళేశ్వరం జలాలు ప్రవహించి ఈ రెండు వాగులు జలకళను తెచ్చాయి. వానలు రావేమో.. వాగులు వట్టిపోవుడేనా అని ఆందోళన చెందుతున్న సమయంలో కాళేశ్వరం జలాలు వాగులను నింపిన మహా జలకార్యాన్ని మరువలేమని.. కప్పలవాగు,పెద్దవాగుతో కాళేశ్వర జలాలతో అనుబంధం ఏర్పడిన సందర్భాన్ని రైతులు చర్చించుకుంటున్నారు.
సరికొత్త జలచరిత్ర..
చినుకు చినుకులై వానలు కురువాలి. వానలు వరదలై పారాలి. వరదలు వాగుల్లో చేరాలి. వాగులు నదిలో కలవాలి. ఇదంతా ప్రకృతి సృష్టి. కానీ నదిలోని వరదనే వాగులను చెరి వరదై పారితే అది కృత్రిమ సృష్టి. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు, పెద్దవాగులో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నప్పుడు చూసిన రైతులు అబ్బురంగా వర్ణిస్తూ మాట్లాడుకున్న మాటలు ఇవి. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సృష్టించిన వాటర్ మాస్టర్ అచీవ్మెంట్తో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోని కప్పలవాగు, పెద్దవాగుల్లో కాళేశ్వర జలాల వరద ఈ సీజన్లో వానలకు ముందే పారింది. అది కూడా పక్కనే ఉన్న నది నుంచో కాదు ఏకంగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని నది రివర్స్గా పారి ఇక్కడి వాగులను నింపిన జలాద్భుతం కప్పలవాగు, పెద్దవాగులో ప్రజలు, రైతుల్లో సంభ్రమాశ్చర్యాలను నింపింది. బాల్కొండతోపాటు రూరల్ నియోజకవర్గంలో పెద్దవాగులోని నదీ జలాలే ఉల్టా వాగుల్లో చేరి పారిన కొత్త జల చరిత్ర ఆవిష్కృతమైంది.
బాహుబలి పైప్లైన్తో జలాలు..
బాల్కొండ నియోజకవర్గం నడిమధ్య గుండా 42కిలోమీటర్ల పొడవునా పెద్దవాగు, కప్పలవాగు ప్రవహిస్తాయి. ఈ వాగులు కాలం కానప్పుడు వట్టిపోవడం మొదలైంది. కాలం కలిసొచ్చినా వానకాలంలో మాత్రమే నీటి జాడలు కనిపిస్తూ మిగతా రెండు కాలాలు వట్టిపోవడం జరుగుతూ వచ్చింది. దీంతో ఈ వాగులకు ఇరువైపులా ఉన్న 32గ్రామాల రైతుల వ్యవసాయక్షేత్రాల్లోని బోర్లల్లో భూగర్భజలాలు తగ్గి సాగునీటి ప్రయోజనం కోల్పోయాయి. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం రూపొందించిన రోజుల్లోనే ఈ వాగుల దుస్థితిని గుర్తించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వర జలాలను తెచ్చి వాగులకు జలకళ తేవాలన్న సంకల్పానికి పూనుకున్నారు. వాగుల్లో నీళ్లుండెలా..వాగు నీళ్లు భూగర్భజలాలుగా ప్రయోజనం చేకూరేలా అడుగడుగునా కోట్లరూపాయల నిధులతో భారీ చెక్డ్యాంలు నిర్మించారు. రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి వచ్చే కాళేశ్వర జలాలను ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతం నుంచి ప్యాకేజ్-21పథకానికి అందించే కాలువ స్థానంలో రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో సమాలోచనలు చేసి సీఎం కేసీఆర్కు విన్నవించి భారీ బాహుబలి పైప్లైన్ను మంజూరు చేయించారు.
ఈ పైప్లైన్ ద్వారా రూరల్ నియోజకవర్గంలోని చింతలూర్ వద్ద పెద్దవాగులోకి కాళేశ్వరం జలాలను విడుదల చేసి చింతలూర్ మొదల్కొని బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం కొత్తపల్లి, పచ్చలనడ్కుడ, వేల్పూర్, మోతె గ్రామాల మధ్య గుండా సుంకెట్, రామన్నపేట్ తదితర దిగువ గ్రామాల నుంచి పెద్దవాగుని నింపుతూ పోయేలా డిజైన్ చేశారు. ఇదే పైప్లైన్ ద్వారా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ వద్ద కప్పలవాగులో విడుదల చేసి బడా భీమ్గల్, భీమ్గల్ గ్రామాల మధ్య నుంచి వేల్పూర్ మండలంలోని అక్లూర్, మోతె, రామన్నపేట్, మోర్తాడ్ మండలంలోని పెద్దవాగులో కలిసే వరకు కప్పలవాగును నింపేలా రూపొందించారు. ఇలా సీఎం కేసీఆర్ అద్భుత ఇంజినీరింగ్ దూరదృష్టి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఖద్దరు ఇంజినీరు నిరంతర కృషి విజయవంతమయ్యాయి.
ఈసారి వర్షాలు సకాలంలో కురువక అన్నదాతలు ఆందోళన చెందుతున్న కష్టకాలంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల కాళేశ్వర జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలించారు. ఆ వెంటనే ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని నవీపేట బినోలా నుంచి 19కిలోమీటర్ల సొరంగమార్గం కాలువ ద్వారా సారంగపూర్లో నిర్మించిన పంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి నిజాంసాగర్ కాలువ ద్వారా మెంట్రాజ్పల్లి పంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి బాహుబలి పైప్లైన్ ద్వారా బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల్లో కప్పలవాగు, పెద్దవాగుల్లోకి విడుదల చేశారు. దీంతో వాగులు నదిని చేరడం కాకుండా నది నీళ్లే వాగుల్లో నిండిన ప్రతిసృష్టి జలదృశ్యం ఆవిష్కృతమైంది. నదీ జలాలు వచ్చి పెద్దవాగు, కప్పలవాగులో నిర్మించిన బడా భీమ్గల్, భీమ్గల్, పచ్చలనడ్కుడ, వేల్పూర్, అక్లూర్, మోతె చెక్డ్యామ్లను నింపేసి దిగువన ఉన్న సుంకెట్, రామన్నపేట్, దొన్కల్, గాండ్లపేట్, పాలెం, ధర్మోరా, తొర్తి గ్రామాల మధ్యగుండా చెక్డ్యాంల వైపు పరవళ్లు తొక్కిన దృశ్యాలను రైతులు నిత్యం చర్చించుకుంటున్నారు.