బాన్సువాడ, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు వారి చల్లని దీవెనలు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. బీర్కూర్ మండల కేంద్రంలో రూ. 6.70 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, కళాశాల భవనాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం కళాశాలలో పర్యటించి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ఇష్టమైన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని తెలిపారు. ఆయన పనులు ఎక్కడా ఆగవని చెప్పారు. తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా 18 నెలల క్రితం మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, కళాశాల నిర్మాణ పనులకు భూమిపూజ చేసినట్లు గుర్తుచేశారు. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డిది వెన్నలాంటి మనస్సు అని కొనియాడారు. బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల కోసం పదివేల డబుల్ బెడ్ రూంఇండ్లను నిర్మించారని తెలిపారు. ఇలా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేవన్నారు. ఇంతచేసిన స్పీకర్కు నియోజకవర్గ ప్రజలు అండగా నిలువాలని కోరారు.
బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ
40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ..సమాజంలో 56 శాతం కుటుంబాలు ఉన్న వెనుకబడిన తరగతులకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఎన్నికల ముసుగులో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో అప్పటి నాయకులు వెనుకబడిన వర్గాలకు విద్యను అందించక అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాకముందు 19 గురుకులాల్లో కేవలం ఏడువేల మందికి మాత్రమే విద్యను అందించారని గుర్తుచేశారు. మనం ఓటు ద్వారా ఒక్కసారి తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తుకు అన్యా యం చేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు.
విద్యతోనే జీవితానికి వెలుగు: సభాపతి పోచారం
విద్యతోనే విద్యార్థుల జీవితానికి వెలుగు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదలు ఆర్థికంగా బాగుపడాలంటే విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు.మౌలిక వసతులు కల్పించడం తమ బాధ్యత అని, చదువుకొని జీవితంలో అభివృద్ధి చెందడం విద్యార్థుల బాధ్యత అని స్పష్టం చేశారు. చదువు అనే ఆయుధం ఉంటే యువత ఎక్కడైనా బతుకగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడాలన్నదే తన ఆశయమని తెలిపారు. తల్లి దండ్రులు కూడా తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. బాన్సువాడ లో ప్రత్యేకంగా బీఎస్సీ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ఆడబిడ్డల కోసం బీసీ డిగ్రీ కాలేజీ మంజూరుచేసిన మంత్రి గంగుల కమలాకర్కు ధన్యవాదాలు తెలిపారు. గురుకులాల్లో చదువుతోపాటు చక్కని వసతి సౌకర్యం కూడా ఉంటుందన్నారు. బీర్కూర్ బీసీ గురుకులంలో మొత్తం 640 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో విద్యార్థులు పాడిన పాటకు స్పీకర్ డప్పు వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.