ఎల్లారెడ్డి, నవంబర్ 7: షెడ్యూల్డ్ తెగల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు న్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడాలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని, మూడోసారి అధికారంలోకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించడం ఖాయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నట్లు ప్రకటించిన తమ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి వారు మాట్లాడారు. లబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర విషయాలపై మంత్రికి విన్నవించారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజిక, రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించారన్నారు. గిరిజనుల కల సాకారం చేసేలా నాలుగు లక్షల ఎకరాలకుపైగా పోడు భూములకు పట్టాలు కేసీఆరే ఇచ్చినట్లు తెలిపారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. న్యాయసలహా అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాలతో లబానా లంబాడాలను ఎస్టీ జాబితాలోకి చేర్చడంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని తప్పక పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి హరీశ్ రావుకు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో లబానా లంబాడా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్, అమర్ సింగ్ నాయక్, చందానాయక్, బిషన్ లాల్ నాయక్, జగదీశ్, గంగారాం, దర్బార్, గోపాల్ తదితరులు ఉన్నారు.