బాన్సువాడ, నవంబర్ 20 : పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి నుంచి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డి బట్టేబాజ్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో సోమవారం బాన్సువాడ నియోజకవర్గస్థాయి ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హోం శాఖ మంత్రితోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను 2009లోఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏనుగు రవీందర్రెడ్డి రూ.5 కోట్లకు అమ్ముడుపోయి వ్యతిరేకంగా ఓటు వేశాడని మండిపడ్డారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న పోచారం తనకే ఓటేశారని మంత్రి గుర్తుచేశారు. రవీందర్రెడ్డి కాంగ్రెస్లో చేరినా అయన మనసు మొత్తం బీజేపీలోనే ఉందన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు తంతే బాన్సువాడలో వచ్చి పడ్డాడని, ఇక్కడి నుంచి కూడా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
పోచారం శ్రీనివాసరెడ్డి మైనారిటీల పక్షపాతి అని మంత్రి తెలిపారు. వారికోసం కోట్లాది రూపాయలు కేటాయించారని, డబుల్బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశారని వివరించారు. మంచి మనసున్న నంబర్వన్ లీడర్ పోచారం అని, చిన్ననాటి ముస్లిం మిత్రుడు చనిపోతే అసెంబ్లీ సమావేశాలను కూడా వదిలి వచ్చిన గొప్ప స్నేహితుడని కొనియాడారు. తన దోస్త్.. పోచారానికి మద్దతిచ్చేందుకే ఇక్కడి వచ్చినట్లు మంత్రి చెప్పారు. కాంగ్రెస్ 50 పాలనలో మైనారిటీలకు చేసిందేమీ లేదన్నారు. ముస్లింల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో కేవలం 12 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేసి లక్షా 20వేల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించారు. సుమారు 5300 మంది మైనారిటీ విద్యార్థులకు ఉన్నత చదువులు, 2.77 లక్షల కుటుంబాలకు షాదీముబారక్ పేరిట చెక్కులు అందజేసినట్లు చెప్పారు. కేసీఆర్తోనే మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
తనను మరోసారి ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొనికాపాడుకుంటానని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి పనులు, పేదలకు సేవలందించే నాయకుడిని ఆలోచించి ఎన్నుకోవాలని సూచించారు. ముస్లింలకు బాన్సువాడ నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ఈద్గాలు, శ్మశానాల ప్రహరీలు, షాదీఖానాలకు భారీగా నిధులు కేటాయించానని తెలిపారు. మైనారిటీ గురుకులాలు, ఉర్దూమీడియం కాలేజీలు ఏర్పాటు చేయించామన్నారు. 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లలో 2500 ఇండ్లు ముస్లింలకే కేటాయించానని వివరించారు. ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. భూ ఆక్రమణలు, లంచాలు, దౌర్జన్యాలు చేయడంతోనే అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. అక్కడ అభివృద్ధి చేయనోడు ఇక్కడెలా చేస్తాడని అన్నారు. ఏనుగు.. కాషాయ పార్టీనుంచి వచ్చినవాడని, షర్టు విప్పితే బీజేపీ బనియనే కనిపిస్తుందని అన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు, వ్యాపకాలు లేవని, ప్రజాసేవే తన జీవితమని అన్నారు. తన పిల్లలకు కూడా ఎలాంటి ఆస్తులూ ఇవ్వలేదని తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.