బిచ్కుంద,జూన్ 5: వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొని పని చేస్తున్నారన్నారు. కులవృత్తులు చేసుకునే నాయీబ్రాహ్మణ, రజకుల దుకాణాలకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని 20వేల వ్యవసాయ మోటర్లకు రూ.80కోట్ల సబ్సిడీ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత పథకాలు అమలు చేయకుండా నిరుపేదలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గతంలో కరెంటు లేక నానా అవస్థలు పడ్డామని, తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్ సరఫరాతో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పుష్కలంగా పంటలు పండిస్తున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో భాగమవుతున్న సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బందికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ కామేశ్వర్రావు, బిచ్కుంద ఏఈ పవన్, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.