పిట్లం, ఏప్రిల్ 15: రాష్ట్రంలోని గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను పట్టించుకునే వారే లేరన్నారు. రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిందేడ్లలోనే తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు. 50 యేండ్లు పాలించిన వివిధ పార్టీలు రాష్ర్టాన్ని పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడాలని సూచించారు. పిట్లం మండలంలో 15 వేల మందికి రైతుబంధు, రైతుబీమా, 6 వేల మందికి ఆసరా పింఛన్లను అందించినట్లు తెలిపారు. రెండు వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులపై ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. మండలంలో 27 వేల మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారని వివరించారు. మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూ.476 కోట్ల నిధులు మంజూరు చేసి నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.మండలంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు. కేసీఆర్ పాలనను దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నాందేడ్ నుంచి సంగారెడ్డి వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించారన్నారు. గతంలో పిట్లం నుంచి బాన్సువాడ వెళ్లాలంటే 1.30 గంటల సమయం పట్టేదని.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ లైన్ల రోడ్డు వేసుకుని అరగంటలో బాన్సువాడకు చేరుకుంటున్నామని వివరించారు.
మండలానికి రూ.10 కోట్లతో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులు మంత్రి హరీశ్రావు ప్రారంభించినట్లు తెలిపారు. మండలంలోని కుర్తి, రాంపూర్, తిమ్మానగర్, కారేగాం గ్రామాల రహదారుల మధ్య వంతెనల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలపై కళాబృందం సభ్యులు పాటల రూపంలో వినిపించారు. కార్యక్రమం అనంతరం పార్టీ శ్రేణులకు భోజనం ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే షిండే స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, , బీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, విజయ్, ప్రతాప్రెడ్డి, కుమ్మరి రాములు, దేవేందర్రెడ్డి, కంబాపూర్, పిట్లం సర్పంచులు కవితాపాటిల్, విజయలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, విండో చైర్మన్లు శపథంరెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఉపసర్పంచ్ ఇబ్రహీం, కో-ఆప్షన్ సభ్యులు రహిమాన్, నాయకులు జొన్న శ్రీనివాస్రెడ్డి, నవీన్, కరీం, నవీన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.