వెనుకబడిన ప్రాంతంగా పేరుపడిన జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు వెలివేసినట్లు ఉన్న ఈ ప్రాంతం రూపురేఖలు మార్చుకొని ప్రగతికి కేరాఫ్ అడ్రస్లా నిలుస్తున్నది. తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
-నిజాంసాగర్, మార్చి 30
నిజాంసాగర్, మార్చి 30: అది మారుమూల నియోజకవర్గం, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో జుక్కల్ నియోజకవర్గం పేరు చెప్పగానే ఎస్సీ నియోజకవర్గం.. అభివృద్ధి అంతంత మాత్రమే.. గ్రామాలకు రహదారులు లేవు. తాగేందుకు నీరు ఉండదు, చదువుకునేందుకు విద్యావ్యవస్థ అంతమాత్రమే, వైద్యం అందని ద్రాక్షనే అంటూ చెప్పుకునే వారు. అలాంటిది స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లను దూరం చేసుకొని ప్రగతి పథాన పయనిస్తున్నది. వేల కోట్లతో వంతెనలు, రహదారుల నిర్మాణం, ప్రతీ గ్రామానికి బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు, పల్లెల్లో వీధివీధినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యరంగంలో అంచలంచెల ప్రగతి సాధించి తొమ్మిదేండ్లలోనే తన రూపురేఖలు మార్చుకొని ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేస్తున్నది.
జుక్కల్ నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోనే వెనుకబడిన నియోజకవర్గంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో గల నియోజకవర్గంగా చెప్పుకుంటారు. నియోజకవర్గంలో రహదారులు లేక రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి బస్సు ప్రయాణాలు లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. చాలా వరకు ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు నడుచుకుంటూ ప్రయాణించేవారు. వానకాలం వచ్చిందంటే చాలు ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండేది. సాగు నీరు, తాగునీరు లేక వేల ఎకరాల భూములు బీడు భూములుగా ఉంచుకునే వారు.
నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో తాగునీరు లేక చెలిమల నుంచి నీటిని తీసుకువచ్చి వాటినే సేవించేవారు. వాగులు, వంకలు దాటుకుంటూ ఇతర గ్రామాలకు వెళ్లాలంటే తెప్పలపై ప్రయాణించేవారు. తెప్ప ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు. అలాంటిది స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రగతిలో దూసుకుపోతున్నది. విద్యా, వైద్యం, సాగు, తాగునీరు, రవాణాతో పాటు మౌలిక వసతుల కల్పనతో తొమ్మిదేండ్లలో తన రూపురేఖలు మార్చుకొని ప్రగతికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది.
ఇంటింటికీ నల్లాలు.. శుద్ధజలం
నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల ప్రజలు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకనాడు తాగునీటి కోసం చెలిమెలను ఆశ్రయించిన జనం నేడు ఇంటికే శుద్ధజలం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గడపకూ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నది. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన సరిహద్దు గ్రామాలు నేటికీ తాగునీటి కటకట ఎదుర్కొంటున్నాయి.
కొత్తగా రెండు మండలాలు..
ప్రజలకు పాలనను దగ్గరగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాలను ఏర్పాటు చేయడంతో వాటి పరిధిలో ఉన్న గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులు దూరమయ్యాయి.
మున్సిపాలిటీలుగా ప్రతిపాదనలు..
నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు ఎమ్మెల్యే షిండే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పిట్లం పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్కు విన్నవించారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించి త్వరలో మున్సిపాలిటీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మెరుగుపడిన విద్యావ్యవస్థ
గతంలో ప్రభుత్వ పాఠశాలలు, సిబ్బంది లేక చాలామంది తమ పిల్లలను బడికి పంపేవారు కాదు. కానీ నేడు విద్యావ్యవస్థ చాలా మెరుగుపడింది. ప్రతి మండలానికి కస్తూర్బా, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించారు. జూనియర్ కళాశాలు, ఉర్దూ మీడియం, హాస్టళ్లలో అదనపు గదులను నిర్మించారు.
ఫోర్లేన్ నేషనల్ హైవే..
సంగారెడ్డి-అకోలా-నాందేడ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. ఈ జాతీయ రహదారి నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గేటు నుంచి మద్నూర్ వరకు దాదాపు అన్ని మండలాల మీదుగా సుమారు 60 కిలోమీటర్లు నిర్మించారు.
మిషన్ కాకతీయతో చివరి ఆయకట్టుకూ సాగునీరు
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో చివరి ఆయకట్టుకూ సాగునీరు అందుతున్నది. నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలతోపాటు కళ్యాణి, సింగీతం, కౌలాస్నాలా ప్రాజెక్టుల్లో పూడికతీశారు. కాలువలకు మరమ్మతులు చేశారు. దీంతో రైతులు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగు చేసుకుంటున్నారు.
కోట్లాది నిధులతో వంతెనల నిర్మాణం..
నిజాంసాగర్ మండల కేంద్రంలో మంజీరా నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు రూ. 25 కోట్లతో కొత్త వంతెన నిర్మించగా ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతోపాటు పిట్లం మండలంలో కుర్తి వంతెన, పెద్దకొడప్గల్ మండలంలో తక్కడపల్లి వంతెన, బిచ్కుంద మండలంలో దేవాడ, పెద్దతక్కడపల్లి వంతెనలు నిర్మించారు. బిచ్కుంద-బాన్సువాడ, పిట్లం-బాన్సువాడ, నిజాంసాగర్-పిట్లం రహదారులను విస్తరించడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది.
మారుమూల పల్లెకూ రోడ్డు..
ఉమ్మడి రాష్ట్రంలో అనేక గ్రామాలు రవాణా సౌకర్యంలేక ప్రజలు కష్టాలను చవిచూశారు. దాదాపు 82 గ్రామాలకు రోడ్లు ఉండేవి కావు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇప్పటివరకు 70 గ్రామాలకు బీటీ రోడ్లు, వంతెనలు నిర్మించారు. నేడు మారుమూల పల్లెకు సైతం రవాణా ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు. మిగితా గ్రామాలకు సైతం రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి.
కాళేశ్వరంతో నిజాంసాగర్కు పూర్వ వైభవం
నిజాంసాగర్కు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైంది. అలాంటిది కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తరలించడంతో ఇప్పుడు మళ్లీ జలకళ సంతరించుకున్నది. ఏడాదిపాటూ నిండుగా దర్శనమిస్తున్నది. ఆశలు వదులుకున్న ఆయకట్టు రైతులు నేడు సాగునీటికి ఢోకా లేకుండా రెండు పంటలూ పండిస్తున్నారు. కాళేశ్వరం నీరు సింగూరుకు సైతం తీసుకురావడంతో ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఏడు మండలాలకు తాగునీరు అందుతున్నది.
మెరుగైన వైద్యం..
మెరుగైన వైద్యం అందలాంటే నియోజకవర్గ ప్రజలు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ప్రతిసారీ ఎన్నికల సమయంలో నాయకులు వైద్యంపై హామీలు గుప్పించేవారు. కానీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల కలను ఎమ్మెల్యే షిండే సాకారం చేశారు. పిట్లం మండల కేంద్రానికి 30 పడకల దవాఖానను మంజూరు చేయించారు. బిచ్కుంద మండల కేంద్రంలో రూ.8 కోట్లతో నూతనంగా దవాఖాన నిర్మించి డయాలసిస్ సేవలు సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానకు పక్కా భవనాలు నిర్మించి మెరుగైన సేవలు అందిస్తున్నారు.
‘నాగమడుగు’తో మారనున్న నియోజకవర్గం దశ
నియోజకవర్గంలో సాగునీటిపై ఎమ్మెల్యే హన్మంత్షిండే ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజాంసాగర్ మండలంలోని కొమలంచ-వడ్డెపల్లి శివారులో మంజీర పరీవాహక ప్రాంతంలో రూ.476 కోట్లతో నాగమడుగు మత్తడి నిర్మాణానికి నిధులు తీసుకువచ్చారు. ప్రస్తుతం మత్తడి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మత్తడి పూర్తయితే నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాలకు చెందిన 40వేల ఎకరాల నాన్కమాండ్ ఏరియాకు సాగునీరు అందనున్నది. దీంతో నియోజకవర్గం దశ మారిపోతుంది. దీంతోపాటు పలు మండలాల్లో 13 చెక్డ్యాములు మంజూరయ్యాయి.