మాక్లూర్/ఆర్మూర్, అక్టోబర్ 27 : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం దుర్గానగర్ తండా, సింగంపల్లి తండా, ఏలియానాయక్ తండాలతోపాటు ఆర్మూర్ మండలం చేపూర్, పట్టణ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రైతుబీమా, రైతుబంధు అన్నదాతలకు వరంగా మారాయని గుర్తు చేశారు. 60 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించినప్పుడు అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తామనడం సిగ్గుచేటని విమర్శించారు.
బీజేపీ నాయకుల మాటలను అసలే నమ్మొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 400కే సిలిండర్ ఇస్తామన్నారు. పింఛన్లు కూడా పెంచుతామని, రైతుబంధు రూ. 16 వేలు అందిస్తామని భరోసానిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు జీవన్రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, సర్పంచులు పద్మావతి, అశోక్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, విండో చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నాయకులు రమణారావు, రంజిత్, అశోక్, లక్ష్మీనారాయణ, సాయిలు, కిషన్లాల్నాయక్, కూరపాటి రమేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, కరీం, గణపతినాయక్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.