ధర్పల్లి, జనవరి 18 : నిజామాబాద్ రూరల్ ప్రాంతంలోని పలుచోట్ల గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పునఃశంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. దీనిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ గ్రామంలో నిజామాబాద్-ధర్పల్లికి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు మొరగు వాగుపై హెచ్ఎల్బీ వంతెన, ఎల్లారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు లింగాపూర్ వాగుపై హెచ్ఎల్బీ వంతెన, ధర్పల్లి మండలంలోని మద్దుల్-గడ్కోల్ ఆర్అండ్బీ రోడ్డు ముత్యాల వాగుపై హెచ్ఎల్బీ వంతెన, గడ్కోల్ గ్రామంలో కప్పలవాగుపై హెచ్ఎల్బీ వంతెనకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. రూరల్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రులను ఒప్పించి అభివృద్ధి పనులకు ఎన్నికలకు ముందుగానే శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు చేపట్టలేదు. ఇప్పుడు మళ్లీ వాటికే శంకుస్థాపన చేయనుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకుస్థాపనలు చేసిన వాటికే తిరిగి శంకుస్థాపనలు చేయకుండా, నూతనంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెంగల్పాడ్, ఎల్లారెడ్డిపల్లి వంతెన నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారని, మళ్లీ అదే పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేయనుండడం సిగ్గుచేటని ఇందల్వాయి ఎంపీపీ రమేశ్ నాయక్ అన్నారు. ఇందల్వాయిలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కొత్త పనులకు నిధులు తేకున్నా.. బాజిరెడ్డి నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేస్తే తిరిగి వాటికే శిలాఫలకాలు వేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఇకనైనా శంకుస్థాపనలను మానుకోవాలని సూచించారు.
శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేయనుండడంపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బాజిరెడ్డి పేర్కొన్నారు.