బాన్సువాడ, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడం.. ప్రజలు, కార్యకర్తల విజయమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్లుగా పనిచేసినవాందరూ ఓడిపోతారనేది కేవలం ఆపోహ మాత్రమే అని పేర్కొన్నారు. విజయం సాధించిన అనంతరం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలతో కలిసి పనిచేస్తే విజయం సాధించవచ్చని అన్నారు. వారితో నిత్యం కలిసి ఉన్నాను కాబట్టే ప్రజలే చరిత్ర తిరుగ రాస్తూ తనను గెలిపించారని పేర్కొన్నారు. ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఏడుసార్లు గెలిపించిన బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. నాయకులు, కార్యకర్తలు , అభిమానుల సహకారంతో విజయం సాధించినట్లు తెలిపారు. ఎన్నికల కోసం అంద రూ రెండు నెలలుగా కష్ట పడ్డారని, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
మరో ఐదేండ్లు ప్రజాప్రతినిధిగా సేవ చేసే అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడి పోయిందని బాధ పడాల్సిన అవసరంలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, హుందాగా ఆంగీకరించాలన్నారు. ప్రజాతీర్పును శిరసా వహించాలన్నా రు. పొరపాట్లను సరిదిద్దుకుంటామని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి ప్రజా సేవకు అంకితమవుతుందన్నారు. ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని స్పష్టం చేశారు. పోచారం వెంట ఆయన సోదరుడు పరిగె శంభురెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ఉన్నారు.