హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.
సుభాష్నగర్, మార్చి 10: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలకు పూర్వవైభవం కల్పించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చకులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ధూప దీప నైవేద్యానికి ఇచ్చే నిధులను రూ. 10వేలకు పెంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాల అభివృద్ధిపై నిర్లక్ష్యం నెలకొన్నది. నిత్య ధూపదీప నైవేద్యం అమలవుతున్న ఆలయాలపై విచారణ చేపడుతున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సర్వే నిర్వహించనుండడం గమనార్హం.
డీడీఎన్ అర్చకులు ఆలయాల్లో పూజలు చేయడం లేదని, ధూపదీప సామగ్రి కొనుగోలు చేయడం లేదని, వారానికి ఒకసారి మాత్రమే అర్చకులు గుడికి వెళ్తున్నారని తదితర కుంటి సాకులతో ఉమ్మడి జిల్లాలోని 150 ఆలయాల అర్చకుల కుటుంబాల కడుపుకొట్టి, వారి జీవనోపాధిని దెబ్బ తీయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 5,800 దేవాలయాలకు ధూపదీప పథకం అమలులోఉంది. అర్చకులకు గౌరవ వేతనం చెల్లించే బడ్జెట్ లేదని డీడీఎన్ ఆలయాలపై దేవాదాయశాఖ థర్డ్ పార్టీ విచారణ చేపట్టడం అర్చకుల్లో అందోళన కలిగిస్తుంది. దేవాదాయశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1958 ఆలయాలు, 2 మఠాలు ఉండగా, ఇందులో ఆదాయం సమకూరే ఆలయాలు 65 మాత్రమే ఉన్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరల దృష్ట్యా అర్చకులకు ప్రతినెలా రూ. 15వేలు గౌరవ వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు జె. రాచప్పస్వామి డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిధుల పెంపు
ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం దీపం వెలగాలని ఆలోచనతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ధూపదీప నైవేద్య పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఒక్కో ఆలయానికి రూ. 2,500 కేటాయించారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక రూ.6వేలుగా నిర్ణయించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చకులకు మేలు చేయాలని ఉద్దేశంతో రూ. 10వేలకు పెంచారు. పూజాసామగ్రికి రూ.4వేలు, అర్చకునికి రూ.6వేలు గౌరవేతనం చెల్లిస్తున్నారు. 2007లో ధూపదీప నైవేద్య పథకం కేవలం 110 ఆలయాలకు మాత్రమే ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఏకంగా 510 గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు నిత్య ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేసి అర్చకుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించింది.
అర్చకులను వేధించడం సరికాదు
అతి తక్కువ గౌరవ వేతనంతో పని చేస్తున్న నిత్య ధూపదీప నైవేద్యం అర్చకులపై ప్రభుత్వం విచారణ చేపట్టడం అందోళన కలిగిస్తున్నది. సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుకొమ్మలైన ఆలయాల పరిరక్షణ కోసం అర్చకులు ఎంతో కృషి చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, ఆరోగ్యశ్రీ పథకం అమలు తదితర సంక్షేమ పథకాలను అర్చకులకు వర్తింపజేసి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
-దౌలతాబాద్ వాసుదేవశర్మ (ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)