కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 15 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,912 మంది విద్యార్థులకు 28,390 మంది హాజరుకాగా.. 1,522 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు జనరల్ 9,106 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 8,689 మంది హాజరయ్యారు. 417 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 850 మంది విద్యార్థులకు 754 మంది హాజరుకాగా, 96 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 9,956 మంది విద్యార్థులకు 9,443 మంది హాజరుకాగా 513 మంది గైర్హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు జనరల్ 17, 374 విద్యార్థులకు 16, 654 మంది, ఒకేషనల్ 2,582 మందికి 2,293 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 19,956 మంది విద్యార్థులకు 18,947 మంది హాజరుకాగా..1009 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. నిమిషం నిబంధన అమలుచేశారు. మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో తొమ్మిది మంది విద్యార్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షకు అనుమతించలేదు. నిజాంసాగర్లో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్వశాంతి, ఉమెన్స్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తనిఖీ చేశారు.