ఖలీల్వాడి, డిసెంబర్ 2 : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేడు (ఆదివారం) కొనసాగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కలెక్టర్ శనివారం సీపీ కల్మేశ్వర్తో కలిసి కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి, ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కలెక్టర్ తన చాంబర్లో ఆరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ఉదయం 5 గంటలకు పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ జరిపించాలని ఆర్వోలకు సూచించారు.
నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నియోజకవర్గ వివరాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఈవీఎంల ఓట్లను రౌండ్ల వారీగా లెక్కిస్తూ, ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే, సంబంధిత నిపుణులు వచ్చి సరిచేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యదాతథంగా కొనసాగించాలని అన్నారు. పాస్లు ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్లోనికి అనుమతించాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేసి జిల్లా కేంద్రంలోని గోడౌన్కు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలోని ఆరు సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, వీరికి ఇప్పటికే పలు విడుతల్లో మాస్టర్ ట్రైనర్లతో కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించామని వివరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజ్ ఉన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో పూర్తి కానున్నది. బోధన్ 18, బాన్సువాడ 19, నిజామాబాద్ అర్బన్ 21, నిజామాబాద్ రూరల్ 21, బాల్కొండ 18 రౌండ్లలో లెక్కించనున్నట్లు వివరించారు.