బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 11: ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బాన్సువాడ ఏరియా దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న దవాఖాన భవనం చాలా పాతదని తెలిపారు. దాని స్థానంలో నూతన భవన నిర్మాణానికి రూ.38 కోట్ల నిధుల మంజూరుతోపాటు అనుమతులు కూడా వచ్చినట్లు చెప్పారు. దవాఖానను ప్రస్తుత భవనం నుంచి ఇతర భవనంలోకి మార్చి వైద్య సేవలు అందించాలని సూచించారు.
నూతన భవన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలోపు బేస్మెంట్ లెవల్ వరకు పనులు పూర్తయితే ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఉన్న దవాఖానలో కొంతభాగం కూల్చివేసి మిగతా భాగంగా ఓపీ, డయాలసిస్ సేవలు కొనసాగేలా చూస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ వివరించారు. పోచారం వెంట మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.