మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నాం 3 గంటలకు 21 వరద గేట్ల ద్వారా 81,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు.
కాకతీయ కాలువకు 6వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మి కాలువకు 80, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180 కూ క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1091.00 అడుగులు ( 90.313 టీఎంసీల) నీటి నిల్వ ఉందన్నారు. ఈ సీజనులో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 574.954 టీఎంసీల వరద వచ్చిందని ఆయన వివరించారు.