కామారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, దీంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తరలివస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అత్యధిక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక, వ్యవసాయరంగాలేనని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగ ళవారం పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించగా.. సభాపతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగం ద్వారా కూలీలు, రైస్ మిల్లులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రైస్మిల్ యజమానులు పది రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇస్తున్నదని, పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో మంచి అవకాశమని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,838.03 కోట్ల పెట్టుబడితో 448 యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వీటి ద్వారా 8043 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని అన్నారు. టీ ఐడియా పథకం కింద 2014-2023 వరకు జిల్లాలో 337 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రూ.87.04 కోట్ల రాయితీలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల వారికి 1024 యూనిట్లకు రూ.45.95 కోట్లు, తెగల వారికి 953 యూనిట్లకు రూ.42.16 కోట్లు, దివ్యాంగులకు 80 యూనిట్ల కోసం రూ.3.92 కోట్ల ప్రయోజనం జరిగిందని వివరించారు. త్వరలో గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందజేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న యువకులు, రైస్మిల్ యజమానులు, దళిత బంధు పథకం ద్వారా లబ్ధిపొందిన యువకులు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా సభలో వివరించారు.
675 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ : కలెక్టర్
సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ శివా రులో 675 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మాచారెడ్డి మండలం లచ్చపేట శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు చేపల పెంపకం చేపట్టి ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైస్మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగంకు జ్ఞాపికను అందజేసి శాలువాతో స్పీకర్ సన్మానించారు. విశేషంగా సేవలందిస్తున్న మీ సేవ నిర్వాహకులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీ బుద్దీన్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్ దోత్రే, చంద్రమోహన్, పరిశ్రమల అధికారి లాలూ నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8,9,10వ తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ఫుడ్ ఫెస్టివల్కు సంబంధించిన వాల్ పోస్టర్లను సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు.