భారతీయ జనతా పార్టీలో పదవుల పందెరం సరికొత్త అంతర్యుద్ధానికి తెర తీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకే పెద్దపీట వేయడంపై సీనియర్లంతా గుర్రుమంటున్నారు. పార్టీని అంటిపెట్టుకొని దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్రంలో అధికారంలోకి రాకమునుపు నుంచి జీవితాలను త్యాగంచేసి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వకుండా పారాచూట్ నేతలనే కీలకస్థానాల్లో కూర్చోబెట్టడం ఏంటం టూ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలకు జిల్లాకు చెందిన కీలకనేతలు వరుస ఫిర్యాదులు అందించారు. బీజేపీలోకి వచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్తో సహా నిజామాబాద్ జిల్లా పూర్వ బీజేపీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నూతనంగా బీజేపీ జిల్లా సారథిగా నియమితులైన కులాచారి దినేశ్కు బీజేపీ భావజాలమే తెలియదని… అలాంటి వారంతా పార్టీలోకి ఇలా వచ్చి అలా పదవులు అందుకోవడం ఏంటంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నది. ఎంపీ అర్వింద్ తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నట్లుగా హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఫిర్యాదులు సైతం చేసినట్లుగా సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలోకి వచ్చి పసుపు బోర్డు హామీతో ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ తదనంతరం నిజామాబాద్ లోక్సభ స్థానానికి చేసిన మేలు అంటూ ఏదీ లేదు. పైగా బీజేపీ బలోపేతం కోసం కృషి చేసిన దాఖలాలు కూడా లేవు. నిత్యం బీఆర్ఎస్ పార్టీపై నోరు పారేసుకోవడం తప్పా చేసిందేమీ లేదన్నది ప్రజలందరికీ తెలిసిందే. ఎంపీగా అర్వింద్ పనితనంపై జనాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మాటలకే కానీ చేతలకు పనికిరాని అర్వింద్తో ఉపయోగం లేదంటూ ఇప్పటికే జనాలంతా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ధర్మపురి అర్వింద్ ఘోరంగా ఓటమి చవి చూశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఓటమి ఖాయమన్న సంకేతాలను గ్రహించే అర్వింద్ ఈ రకమైన ప్రయోగం చేసినట్లుగా బీజేపీలో చాలా మంది నేతలంతా గ్రహించారు. అర్వింద్ ఒకటి తలచితే మరోటి అయినట్లుగా కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందడం అందులోనూ ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రజలంతా ఛీత్కరించుకోవడంతో ఎంపీగా పోటీ చేయడంపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఎమ్మెల్యేగా ఓటమి చెందిన వ్యక్తికి ఎంపీగా టికెట్ ఇవ్వొద్దంటూ బీజేపీ సీనియర్ నేతలంతా వరుస కట్టి ఫిర్యాదులు అందించారు.భారతీయ జనతా పార్టీలో పదవుల పందెరం సరికొత్త అంతర్యుద్ధానికి తెర తీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకే పెద్దపీట వేయడంపై సీనియర్లంతా గుర్రుమంటున్నారు.
బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీనర్సయ్యను మార్చడంతో సొంత పార్టీలోనే అర్వింద్కు వ్యతిరేకంగా సెగలు రేగుతున్నాయి. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పదవి నుంచి తప్పించడంపై సదరు సామాజికవర్గానికి చెందిన వారంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లుగా తెలిసింది. ఎంపీ ధర్మపురి అర్విందే ఇదంతా చేయించినట్లుగా బీజేపీలో సమాచారం దావానంలా వ్యాప్తి చెందడంతో వారంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అరుణతారను బీజేపీ కొనసాగించగా నిజామాబాద్లో మాత్రం పారాచూట్ నేతకు ప్రాధాన్యం ఇవ్వడం సెగలు రేపుతున్నది. బస్వాను తప్పించినప్పుడు సీనియర్ నేతల్లో ఒకరికి పదవిని కట్టబెడతారని అందరూ ఊహించగా అందుకు విరుద్ధంగా నిర్ణయం వెలువడడంతో కాషాయ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు, జిల్లా అధ్యక్ష పదవుల్లో చోటు దక్కని వారంతా ఏకతాటిపైకి వచ్చి ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహరిస్తున్న తీరుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కోరుట్లలో ఓటమితో ఢిల్లీ పెద్దల ముందు అర్వింద్కు పలుకుబడి పూర్తిగా పోయింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు బీజేపీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పెర్కిట్ శివారులో విద్యాసంస్థలను నడుపుతున్న బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ ఇప్పటికే అధిష్టానానికి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసినట్లు తెలిసింది. యెండల లక్ష్మీనారాయణ సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాలకు ఇప్పటికే అర్వింద్ వైఖరిపై ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తున్నది.