బాన్సువాడ, ఆగస్టు 16 : దశాబ్దాలుగా నలిగిపోయిన ‘ఆమె’కు భరోసా దొరికింది. షీ టీమ్ రూపంలో అతివకు కొండంత అండ లభించింది. ఇంటా బయటా చితికిపోయిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతను కల్పించింది. ఆపదలో ఉన్న అబలలకు, ఆకతాయిల వేధింపుల నుంచి యువతులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2014 అక్టోబర్ 24న ఏర్పాటు చేసిన షీ టీమ్లు అద్భుతంగా పని చేస్తున్నాయి. ఇబ్బందులు ఉన్నాయని ఫోన్ చేయగానే వెంటనే రంగంలోకి దిగుతున్న బృందాలు బాధితులను సంరక్షిస్తున్నాయి. మహిళలను వేధిస్తున్న వారిని కటకటాల్లోకి పంపిస్తున్నాయి.
మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వ అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోలీస్శాఖలో అనేక నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రధానంగా మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 24న షీటీములను అందుబాటులోకి తెచ్చింది. కామారెడ్డి జిల్లాలో మూడు సబ్ డివిజన్ల పరిధిలో ఒక్కో షీటీమును ఏర్పాటు చేసి మహిళలకు భధ్రత కల్పిస్తున్నారు.
భరోసానిస్తున్న షీటీమ్స్..
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలో షీటీములను ఏర్పాటుచేసి ర్యాగింగ్, ఈవ్టీజింగ్, పోక్సో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 285 కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, ప్రజలను చైతన్య పర్చారు. దీంతోపాటు బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కళాశాలలు, సినిమా హాళ్ల వద్ద క్యూఆర్ కోడ్తో కూడిన షీటీమ్ పోస్టర్లను అతికించారు. మహిళలకు సమస్యలు ఎదురైతే వెంటనే క్యూఆర్ కోడ్ను స్కాన్చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.
పెరుగుతున్న సైబర్ మోసాలు..
రోడ్లపై ఆకతాయిల వేధింపులతోపాటు ఉద్యోగం చేసే మహిళలను పైస్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం, విద్యార్థినుల అసభ్యంగా ప్రవర్తించడం వంటివాటిపై షీ టీములు కఠినంగా వ్యవహరిస్తునాయి. ఫిర్యాదులు అందిన వెంటనే బాలికలు, యువతులు, మహిళలను ఇబ్బందిపెట్టే ఆకతాయిలను అరెస్టు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితులకు శిక్షపడేలా చూస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నారు. స్నేహం పేరిట పోస్టులు పెట్టి దగ్గరవుతున్నారు. అనంతరం వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లోనూ షీటీమ్ పోలీసులు ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతోపాటు ఇతర వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
101 ఫిర్యాదులు..
తరుచూ నేరాలు జరిగే ప్రాంతాలను హాట్స్పాట్లుగా షీటీం పోలీసులు గుర్తించారు. ఆయా ప్రదేశాలను పోలీసులు మఫ్టీలో ఇప్పటివరకు 628 సార్లు తనిఖీ చేశారు. ఆకతాయిలను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మార్పు కనిపించకపోతే కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు షీ టీములకు మొత్తం 101 పిర్యాధులు అందాయని, ఇందులో 26 మందిపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈవ్ టీజింగ్కు పాల్పడిన వంద మందిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 120మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. 35 ఫిర్యాదుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించినట్లు షీటీం సభ్యులు తెలిపారు. మరో 25 పిటిషన్లలో కౌన్సెలింగ్ ఇచ్చామని వివరించారు.
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు ప్పాలడితే వెంటనే షీటీం నంబర్ 8712686094కు కాల్ చేయాలి. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడినుంచైనా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలాంటి ఆపద వచ్చినా డయల్ 100కు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి ఆదుకుంటారు. గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సెల్ నంబర్లు, వ్యవక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోకూడదు.
-శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి జిల్లా