మోర్తాడ్, ఫిబ్రవరి 22: కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. అందులో భాగంగానే గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల చదువును పరిశీలించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగింది. మోర్తాడ్ మండలం పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 2018లో ఏడు తరగతులకు కేవలం 56 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం ఈ పాఠశాలలో 186మంది విద్యార్థులు చదువుతున్నారు. వేరే గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తుండడంపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ఈ పాఠశాలలో గ్రామస్తులు వితరణగా ఇచ్చిన కంప్యూటర్లు ఉండడంతో కంప్యూటర్ విద్యను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. అన్ని రకాలుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా ఉపా ధ్యాయులు పాఠాలను బోధిస్తున్నా రు. ఉపాధ్యాయుల కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
పాలెం ఉన్నత పాఠశాలలో 2018లో 56మంది విద్యార్థులు మాత్రమే చదివేవారు. కరోనా కారణంగా ప్రైవేటులో ఫీజులు చెల్లించే పరిస్థితి లేకపోవడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుపై ఇంటింటికీ తిరిగి పట్టించుకోవడంతో ప్రజల్లో కదలిక వచ్చింది. ఈ పాఠశాలలోనూ ఇంగ్లిష్ మీడియం ఉండడంతో ప్రైవేటుకు మాన్పించి తమ పిల్లలను ప్రభుత్వపాఠశాలకు పంపించారు. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 186కు చేరుకున్నది.
ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. గదుల కొరత, పెచ్చులూడిన గదులు ఈ పాఠశాలలో ప్రధాన సమస్యలుగా మారాయి. కంప్యూటర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. మన ఊరు…మనబడి కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులుండవు.
నాకు వర్షిత, చైత్ర ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిని ప్రైవేటులో చదివించేందుకు రూ.15వేల ఫీజు చెల్లించేవాడిని. పాలెం ప్రభుత్వపాఠశాలలో బోధన, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ తరగతులు కొనసాగుతున్నాయని తెలియడంతో చేర్పించాను. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు మా గ్రామంలోని పాఠశాలలోనే నా కూతుళ్లను చదివించే అవకాశం కలిగింది.
– శ్రీనివాస్, తొర్తి గ్రామం
నా కుమారుడు సాకేత్గౌడ్ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదివేవాడు. సంవత్సరానికి రూ.5వేల ఫీజు చెల్లించాల్సి వచ్చేది. మా గ్రామంలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం, కరోనాతో పనులు లేకపోవడంతో ఎలా చదివించాలో అని భయపడ్డాను. కానీ పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉండడంతో ఆ పాఠశాలలో చేర్పించాను. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించవచ్చు.
-నర్సాగౌడ్, తొర్తి గ్రామం