మంజీరా పరీవాహకంలో ఇసుక దందా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ ద్వారా నిర్వహించే ఇసుక రీచ్లను కాలపరిమితి పేరిట మూసేయించిన కాంగ్రెస్ నేతలు.. పరోక్షంగా అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. లారీలు, టిప్పర్లలో తరలిస్తే బండారం బయట పడుతుందని… అక్రమార్కులు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారుగా 150ట్రాక్టర్లలో మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్నట్లుగా సమాచారం. అధికారులకు సాక్ష్యాధారాలు లభించకుండా ట్రాక్టర్లు, ట్రాలీలకు నంబర్ ప్లేట్లు తీసేసి ఇసుక రవాణాకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు జాగ్రత్త పడుతున్నారు.
టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతులతో ఇసుక రీచ్లు నడిపినప్పుడు ప్రజలకు ఇసుక విరివిగా లభించేది. గనుల శాఖ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వ్యాపారులు అక్రమ దందాను నడిపినప్పటికీ ఇసుక లభ్యతతో నిర్మాణాలకు సరసమైన ధరల్లోనే దొరికింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇసుక కొరత లేకుండా ఉండేది. గడిచిన రెండు నెలల్లో ఇసుక కొరతతో ధరలకు రెక్కలు వచ్చాయి. ఇండ్లు నిర్మిస్తున్న సామాన్యులకు ఇసుక దొరకడం గగనంగా మారింది. ధరల పెరుగుదలకు తోడుగా అక్రమంగా తరలిస్తున్న ముఠాలు పెద్దఎత్తున దండుకుంటున్నాయి. బీర్కూర్లో రీచ్ల మూతతో కాళేశ్వరం నుంచి వచ్చే ఇసుక
టన్నుకు నవంబర్ నెలలో రూ.1050 ఉండగా ఇప్పుడేకంగా రూ.1450 చేరింది. సన్నరకం ఇసుక ఏకంగా రూ.1800 వరకు చేరుకున్నది. ఈ మార్పును గమనిస్తున్న జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పారదర్శకంగా చేపట్టాల్సిన ప్రక్రియను మూసేసి అక్రమ ఇసుక దందాను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రభుత్వ ఆదాయానికి సైతం దొడ్డిదారిలో ఇసుక తరలింపుతో నష్టం వాటిల్లుతున్నది. నేరుగా ఇసుకాసురుల జేబుల్లోకే ఈ సొమ్ము వెళ్తున్నది. ఇంత భారీగా ఇసుక రవాణా జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడం లేదు. ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో పోలీస్శాఖలో తీవ్రమైన చర్చ జరిగింది. కానిప్పుడు అవన్నీ ఉత్త మాటలేనని తేలిపోవడంతో అక్రమార్కులకు బలం చేకూరినట్లు అవుతున్నది. ఎమ్మెల్యే సిఫార్సులకు సంబంధం లేకుండా పనితనమే గీటురాయిగా వ్యవహరించే ఖాకీలకు పోస్టింగ్లు ఇస్తామంటూ చెప్పినప్పటికీ అవేవి అమలు కావడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతల పైరవీలతో పోలీసు అధికారులు తమకు నచ్చిన చోట పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. ఇందు లో మంజీర పరీవాహక ప్రాంతా ల్లో ఈ మధ్య జరిగిన పోలీసు అధికారుల బదిలీలే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. గతంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం, నిజామాబాద్ అర్బన్లో పనిచేసి కళంకితుడిగా ముద్ర వేసుకున్న ఓ వ్యక్తిని తీసుకువచ్చి ఇసుక రీచ్లు ఎక్కువగా ఉండే ఠాణాలకు పోలీస్ అధికారిగా నియమించారు. ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లుగా తెలుస్తున్నది. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లోని మండలాల్లోనైతే దూకుడు స్వభావం, చేతి చమురు భారీగా వదిలించే వ్యక్తులుగా ముద్ర వేసుకున్న వారికి పెద్దపీట వేసినట్లుగా తెలుస్తున్నది. కొంతమంది పోస్టింగ్ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సైతం వారించినా ప్రభుత్వ పెద్దలతో చెప్పించుకోవడంతో ఐజీస్థాయి అధికారులు కూడా ఏమీ చేయలేక సంతకాలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
రుద్రూర్ మండలం సుంకినిలో డిసెంబర్ 25న, జనవరి 1న ట్రాక్టర్లను పట్టుకున్నారు. పొతంగల్ సమీపంలోని మంజీరా నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 8న ఓ ట్రాక్టర్, 14న నాలుగు ట్రాక్టర్లు, 27న మరో ట్రాక్టర్, ఫిబ్రవరి 1న ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన ట్రాక్టర్లు, టిప్పర్లు మామూళ్లు ఇవ్వని వారివిగా తెలుస్తున్నది.
జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లి మండలంలో కుర్లా, సిర్పూర్ నుంచి ట్రాక్టర్లలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకు సైతం ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. రోజూ 20 వరకు వాహనాలు నడుస్తున్నాయి. ఇదంతా పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి తెలిసే హస్తం పార్టీ అండదండలతో జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు అందగా పైపై దాడులతో కేవలం 12వాహనాలను పట్టుకొని జరిమానా విధించారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజిద్నగర్, ఖడ్గం, సెట్లూర్, హస్గుల్, బండరెంజల్ నుంచి అనుమతులు లేకుండా ఇసుకను రాత్రివేళల్లో యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే ఏకంగా మంజీర పరీవాహకంలోనే ఎక్కువగా పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సమీపంలోని ఓ గ్రామంలో సొంతింటి నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. స్థానిక నేతలను కాదని పక్క నియోజకవర్గం నుంచి వచ్చి హడావిడి చేస్తున్న మాజీ ప్రజాప్రతినిధిపై లోకల్ లీడర్లు ఇప్పటికే గుస్సా అవుతుండగా ఇసుక పంచాయితీ విషయంలో వివాదం రాజుకుంటున్నది. ఇసుక రీచ్ల నుంచి అక్రమ తంతును ఇష్టానుసారంగా నడిపించుకునేందుకు ఇదంతా చేస్తున్నట్లుగా అర్థమవుతున్నది. సదరు నాయకుడి అండదండలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇసుకాసురులుగా పేరొందిన వారంతా ట్రాక్టర్లు, టిప్పర్లతో మంజీర పరీవాహక ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. మొత్తానికి మంజీర పరీవాహకంలో జరుగుతున్న సరికొత్త రాజకీయంతో స్థానిక జనమంతా నెత్తి పట్టుకుంటున్నారు.
మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక క్వారీ లు, ఇసుక తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలే దు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మంజీరాలో పలుచోట్ల వాహనాల రాకపోకలు జరుగకుండా కందకాలు తవ్విం చాం. సిబ్బంది కొరతతో తనిఖీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్రమంగా ఇసుక తవ్వితే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.