భీమ్గల్, జూన్ 7: మండలంలోని లింబాద్రి గుట్ట ఒడ్డెర కాలనీలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన తనను కలిచివేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాలనీలో నివాసం ఉంటూ కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్న వారి గుడిసెలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదర్చారు.
కన్నీరు మున్నీరవుతున్న తల్లుల రోదనలు వేములను కలిచివేశాయి. ఘటన సమయంలో తన కుమారుడు, కూతు రును కోల్పోయిన ఓ తల్లి తీవ్ర మనోవేదనలో అదే కుంటలోకి దూకేందుకు యత్నించగా ఆమె కాలికి గాయమైంది. ఈ విష యం తెలుసుకున్న వేముల ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు. చికిత్స కోసం ఎలాంటి బిల్లులూ తీసుకోవద్దన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోకు ఫోన్ చేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సాయం అందించాలని కోరారు.
వారికి పక్కా ఇండ్లు మంజూరు చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు రూ. 18 వేలు ఆర్థిక సాయం అందజేశారు.అనంతరం ఆయన ప్రమాదానికి కారణమైన నీటి కుంటను పరిశీలించారు. ప్రమాదకరంగా మారిన కుంటను పూడ్చివేసేందుకు చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వేముల వెంట మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, కౌన్సిలర్లు నీలం రవి, బొదిరె నర్సయ్య, నాయకులు రాజూనాయక్, సూర్జీల్, సాయి కుమార్, శెవ్వ అశోక్, కైత సాగర్, శ్రీపాద గోపి, తొగిటి అరుణ్ తదితరులున్నారు.