బాన్సువాడ, సెప్టెంబర్ 13 : దేశంలోనే కేసీఆర్ను మించిన నాయకుడు లేడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. 30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్డౌన్ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడం లేదని అన్నారు. తాను 43 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటి వరకు మర్రి చెన్నారెడ్డి నుంచి వరకు అన్ని పార్టీల ముఖ్యమంత్రులను చూశానని తెలిపారు. కానీ గతంలో అసెంబ్లీలో పద్దుల మీద చర్చ జరిగేది కాదన్నారు. కానీ కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ప్రాణం పణంగా పెట్టి ఉద్యమించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారు తామే రాష్ర్టాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు.
1969లో బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాను ఇంజినీరింగ్ చదువుతున్నానని, అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఇవ్వకపోవడంతో ఉద్యమంలో 369 మంది పోలీసుల తూటాలకు బలయ్యారని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఉద్యమంతో భయపడి కేంద్రం రాష్ర్టాన్ని ఇచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ గారు గొప్పా లేక స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్ వారు గొప్పా అన్ని ప్రశ్నించారు. అదేవిధంగా కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఈ రోజు మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయంటే కారణం ఉద్యోగుల సహకారమే అని తెలిపారు. ఈ రోజు దేశంలోనే రాష్ట్ర జీడీపీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏ ప్రభుత్వాలు విజయం సాధించినా దాంట్లో ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్ను టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు సన్మానించారు.
రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ అండగా ఉందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షు డు రాజేందర్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తున్నదని వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసిందన్నారు. ఉద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వానికి అండగా నిలవాలని, ప్రభుత్వ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాబోవు రోజుల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కానున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, గుంగుల గంగారాం, పిట్ల శ్రీధర్, గోపాల్ రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల టీఎన్జీవోస్ అధ్యక్షుడు కిషన్, వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, బాన్సువాడ అధ్యక్ష కార్యదర్శులు అనిల్, వెంకట్, ఏటీవో జగన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.