నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి రైతు పంట మార్పిడి చేసేందుకు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం సూచించినట్లుగా యాసంగిలో పంట మార్పిడి చేసి సాగు చేస్తే అధిక దిగుబడులు పొంది తద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా సీఎం కేసీఆర్, పంట పెట్టుబడి సహాయం, రైతుబీమా, ఉచితంగా కరెంట్ సరఫరా వంటి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని చెప్పారు.
అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శనగ, కందులు, సన్ఫ్లవర్, నువ్వులు, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు తదితర మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లబ్ధి పొందాలని రైతులకు సూచించారు. ఎప్పుడూ వరి పంట ఒక్కటే సాగు చేయొద్దని, వాణిజ్య పంటల సాగు పట్ల కూడా ఆసక్తి చూపాలని కోరారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం, సస్యరక్షణ చర్యల గురించి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ వివరించారు. సదస్సులో డీఏఓ గోవింద్, ఏడీఏ వెంకటలక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి, ఎంపీడీవో మల్లేశ్, ఏఓ హీరాజాదవ్, ఎంపీఓ మధురిమ, సర్పంచ్ లక్ష్మణ్రావు, ఎంపీటీసీ అంకల గంగాధర్, సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, ఉపసర్పంచ్ శంకర్రెడ్డి, కార్యదర్శి సుధాకర్రెడ్డి, ఏఈఓ రాకేశ్ రైతులు పాల్గొన్నారు.