నిజామాబాద్ లీగల్, జూన్ 24: ఐదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన రెండు నేరాల్లో ముద్దాయి దేవకత్తె గోవింద రావుకు రెండు జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పునిచ్చారు. కోర్టు వెలువరించిన 48 పేజీల తీర్పులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఐదేండ్ల బాలిక మృ తి కేసులో సదరు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు డిచ్పల్లి పోలీస్స్టేషన్ హౌజ్ అధికారి రూపొందించిన ప్రాథమిక నివేదిక అనంతరం నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ నేర విచారణ చేశారు. బాలిక తల్లి, బంధువులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజ్, బాలిక పోస్ట్మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేస్తూ అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు.
నేర న్యాయవిచారణలో భాగంగా మొత్తం 24 మంది సాక్షు ల వాంగ్మూలాలు నమోదు చేసిన ప్రత్యేక పోక్సో కోర్టు.. 35 ధ్రువీకరించిన పత్రాలు, ఐదు వస్తుగత సాక్ష్యాలు అధ్యయనం చేసి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవిందరావుకు ఈ శిక్షలు విధించారు. కాగా, గోవిందరావు బతుకుదెరువు కోసం హైదరాబాద్లో నివాసం ఉండేవాడు. అక్కడ ఓ ఐదేండ్ల పాప, మరో రెండేండ్ల కూతురుతో భర్తను విడిచి ఉంటున్న మహిళను వివా హం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ నుంచి డిచ్పల్లికి సదరు మహిళతో వచ్చి ధర్మారం(బీ)లో ఓ రైతు వద్ద జీతానికి కుదిరాడు. తమతో ఉంటున్న ఐదేండ్ల చిన్నారి కాలికి దెబ్బ తగలడంతో అదే గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు చికిత్స కోసం 20 అక్టోబర్, 2022న తీసుకొని వెళ్లి తిరుగు ప్రయాణంలో మెంట్రాజ్పల్లి శివారులోని ఓ వ్యవసాయ పొ లం వద్ద బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో శారీరకంగా గాయపర్చాడు.
స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తెచ్చాడు. నడుచుకుంటూ వెళ్ల్లిన బాలిక స్పృహ ఎందుకు కోల్పోయిందని తల్లి అతన్ని నిలదీయడంతో అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పాడు. వెంటనే బాలికను నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మృతి చెందింది. బాలల లైంగిక వేధింపులు, దాడి నుంచి రక్షణ చట్టం సెక్షన్ 5(ఐ) (ఎం), ఇండియన్ పీనల్కోడ్ సెక్షన్ 376 (ఎ), ఏబీ, 376 (2) (ఎఫ్), 302 సెక్షన్ల ప్రకారం అత్యాచారం నేరానికి జీవిత ఖైదు, అత్యాచారానికి పాల్పడి బాధితురాలి మరణానికి కారణమైనందుకు హత్యానేరం కింద మరో జీవిత ఖైదు విధించారు. రెండు జీవిత కారాగార శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిడుగు రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. బాలిక కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ తరఫున అందించాలని సెషన్స్ జడ్జి సునీత కుంచాల తీర్పులో వెల్లడించారు.