మోర్తాడ్, ఫిబ్రవరి 12: ఈ ఏడాది వానకాలం రైతులకు కలిసిరాలేదు. అకాలవర్షాలతో పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రస్తుతం పసుపు పంట సాగుపై ఆసక్తిచూపారు. మంచి ధర వస్తే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశపడుతున్నారు. ఆరంభంలో ధర బాగానే ఉంటున్నా, మార్కెట్కు పసుపు రాక ప్రారంభంకాగానే దళారులు ధరను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.12వేల వరకు వస్తున్నదని, ఇదే ధర లభిస్తే తమ కష్టాలు గట్టెక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లో ఎక్కువగా పసుపు పండిస్తున్న రైతుల ఆశలన్నీ పసుపుపైనే ఉన్నాయి. ప్రస్తుతం పసుపు తవ్వకాలు, ఉడకబెట్టే పనులు జోరందుకున్నాయి.
ఉడకబెట్టే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
పసుపును ఉడకబెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పసుపును తవ్విన రెండు, మూడు రోజుల్లో ఉడకబెట్టాలి. పసుపునకు ఉన్న మట్టి, వేర్లు, పీచును తొలగించి, శుభ్రపర్చిన తర్వాత ఉడకబెట్టాలి. ఆవిరియంత్రం ద్వారా ఉడకబెట్టడంతో పసుపులో ఉన్న కర్కుమిన్ శాతాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. పసుపు ఎక్కువగా, మరీ తక్కువగా ఉడకబెట్టకుండా చూసుకోవాలి. ఉడకబెట్టిన పసుపును పదిరోజులపాటు ఎండబెట్టాలి.
మహారాష్ట్ర నుంచి కూలీలు
పసుపు ఉడకబెట్టడం ప్రారంభమైందంటే చాలు మహారాష్ట్ర నుంచి కూలీలు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు వలస వస్తుంటారు. ఇక్కడ ఆవిరి యంత్రాలు ఉన్న వారు మహారాష్ట్ర కూలీలను పిలిపించుకుంటారు. వారికి పసుపు ఉడకబెట్టినందుకు డ్రమ్ముకు దాదాపు రూ.80 వరకు చెల్లిస్తుంటారు. ఒకరోజులో 50 కి పైగా డ్రమ్ముల పసుపును ఉడకబెడుతుంటారు. పసుపును ఉడకబెట్టి కుప్పలుగా పోయడం వీరిపని. ఏడెనిమిది మంది కలిసి ఒక గ్రూపుగా వస్తుంటారు. జనవరిలో వచ్చిన వీరు మార్చి చివరి వరకు ఇక్కడే ఉండి పసుపు ఉడకబెట్టే పనులు పూర్తికాగానే తిరిగి తమ సొంతూళ్లకు వెళ్లి పోతారు. ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి ఎక్కువగా కూలీలు వస్తుంటారు.
ప్రతి ఏడాది వస్తాం..
పసుపు ఉడకబెట్టేందుకు ప్రతి సంవత్సరం జనవరిలో వస్తాం. మళ్లీ మార్చి చివర్లో తిరిగి వెళ్లిపోతాం. పసుపు ఉడకబెట్టే పని ఉంటే మా సేట్ పిలుస్తడు, పిలవగానే మా గ్రూపు మొత్తం వచ్చి ఇక్కడే ఉంటాం. ఎక్కవ పని ఉంటే అక్కడికి పోయి పసుపును ఉడకబెడుతాం. పసుపు పనులు ముగిసిన తర్వాతే మేము మా ఊళ్లకు వెళ్తాం.
-ఆనంద్, బెల్లోరిధనూరా, మహారాష్ట్ర
రూ.50వేలకు పైగా సంపాదిస్తాం
పసుపు ఉడకబెట్టే పనుల కోసం ఇక్కడకు వచ్చి మూడునెలలు ఉంటాం. తక్కువల తక్కువ రూ.50వేల వరకు సంపాదిస్తాం. పనిని బట్టి పైసలు వస్తయి. పని ఎక్కువగా ఉంటే పైసలు ఎక్కువగా వస్తాయి. పసుపు ఉడకబెట్టే పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటాం.
– ఉత్తమ్, బెల్లోరిధనూరా, మహారాష్ట్ర