ఖలీల్వాడీ(మోపాల్), సెప్టెంబర్ 27 :మైనార్టీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భారతిగార్డెన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని మైనార్టీలకు మైనార్టీ బంధు చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు ఇండ్లకే పరిమితమైన ఆడపిల్లలు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మైనార్టీల విదేశీ విద్య కోసం ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకవచ్చిందన్నారు. మసీదులు, షాదీఖానాల నిర్మాణానికి బడ్జెట్లో కోట్లాది రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో రూ. 4 కోట్ల విలువ గల ప్రొసీడింగ్ కాపీలను అందజేసినట్లు చెప్పారు. మైనార్టీ బంధు పథకంతో ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ మైనార్టీ కో-ఆప్షన్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన నాయకులు పాల్గొన్నారు.
ధర్పల్లి, సెప్టెంబర్ 27 : ధర్పల్లి మండల కాంగ్రెస్ యువజనం విభాగం వైస్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.