శక్కర్నగర్, జూలై 13: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ట్రాక్టర్లకు బదులుగా ట్రాలీ ఆటోల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ట్రాలీ ఆటోలకు నంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. ఆదివారం అయితే చాలు.. ముఖ్యంగా బోధన్- నిజామాబాద్ రహదారిపై ట్రాలీ ఆటోలు పోటీ పడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇసుకను అక్రమంగా తరలించే కొన్ని ఆటోలు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ల మీదుగా వెళ్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొన్ని ఆటోలు మాత్రం బోధన్ మండలంలోని పలు గ్రామాల మీదుగా, పెగడాపల్లి, పెంటాకలాన్, సాటాపూర్ గేట్ నుంచి సారంగపూర్ జైలు రోడ్డు గుండా పోలీస్ స్టేషన్లను తప్పించుకుంటూ వెళ్తున్నాయి. ప్రతిరోజూ ఈ రహదారి మీదుగా సుమారు 50 నుంచి వంద ట్రాలీ ఆటోల్లో ఇసుక రవాణా జరుగుతున్నది. ఇసుక అక్రమ రవాణా మాట ఎలా ఉన్నా.. మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆటోలకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో కేసులు ఎలా నమోదు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. ఆటోలకు నంబర్ప్లేట్లు లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్లడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు తనిఖీలు చేసే పోలీసులకు ఈ ఆటోలు కంటపడడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, నంబర్ ప్లేట్ లేని ఆటోలను సీజ్ చేయాలని మండలవాసులు కోరుతున్నారు.