ఖలీల్వాడి, ఏప్రిల్ 8: బీఆర్ఎస్ అంటే కులమతాలను కలుపుకొనే పార్టీ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్లో ఉన్న డ్రైవర్స్ కాలనీలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వేముల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ముస్లిముల అభ్యున్నతికి కృషి చేశామని, మసీదులకు అనేక నిధులు ఇచ్చినట్లు వివరించారు. మైనార్టీ ఆడబిడ్డలకు రూ. లక్షా116 ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఝుఠా పార్టీలను నమ్మొద్దని, మోదీ, రేవంత్రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. తెలంగాణ షిండేగా రేవంత్ రెడ్డిని అభివర్ణించారు.
పసుపుబోర్డు తెస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్ కాలయాపన చేశారని, ప్రస్తుతం గెలవనని తెలిసి మోదీకి ఓటు వేయాలని ప్రజలని వేడుకుంటున్నారని తెలిపారు. ఉక్కులాంటి మనిషి బాజిరెడ్డి గోవర్ధన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మీర్ మజాజ్ అలీ, ఎస్ఏ అలీం, నగర అధ్యక్షుడు సిర్పరాజు, ఫయాజ్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, ప్రభాకర్రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్సింగ్ ఠాకూర్, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.