మోపాల్ (ఖలీల్వాడి), నవంబర్ 17 : రైతుబంధును ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. రాబంధు కాంగ్రెస్ కావాల్నా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను ప్రశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలంలో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రూరల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందజేశామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంట్ కటకటతో రైతులు రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లి విద్యుత్ షాక్, పాము కాటుతో చనిపోయారని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం విడ్డూరమని, ప్రజలు ఈ విషయమై ఆలోచించాలని సూచించారు. తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి, భూమారెడ్డి, ఎంపీపీ లతా కన్నీరాం, జడ్పీటీసీ కమలానరేశ్, సర్పంచులు రవి, ముత్యంరెడ్డి, కంజర భూమయ్య, సాయిరెడ్డి, మమతాసాయిరెడ్డి, భరత్, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.