ఆర్మూర్టౌన్, ఫిబ్రవరి 8: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్లో గురువారం బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జీవన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఆర్మూర్ను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, ఇది నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ఎటు చూసినా బీటీ రోడ్లు కనిపిస్తున్నాయే తప్ప మట్టి రోడ్లు కనబడడంలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఏకైక సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన రాష్ట్రంలోనే జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. అమలుచేసేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.