కాంగ్రెస్ పార్టీ రైతులపై పగబట్టినట్టున్నది. దర్జాగా బతుకుతున్న అన్నదాతలను ఆగం జేస్తున్నది. మూడు గంటల కరెంట్, ధరణి ఎత్తివేత, 10 హెచ్పీ మోటర్ల వంటి వ్యాఖ్యలు హస్తం పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే పదేండ్ల కిందటి దుర్భర పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో ఎకరాకు లక్ష రూపాయలు పలుకని భూములు ఇవాళ ఊహించని స్థాయికి చేరాయి. ఏ పల్లెకు వెళ్లినా, ఏ మూలకు వెళ్లినా రూ.30 లక్షల పైనే పలుకుతున్నాయి. భూముల రేట్లు పెరగడానికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. సాగునీటి సౌలభ్యం పెంచడం, 24 గంటల కరెంట్, ధరణితో భూములకు రక్షణ కల్పించడంతో భూమి విలువ అమాంతం పెరిగింది. ఫలితంగా రైతాంగం భరోసాతో బతుకుతున్నది. పొరపాటున కాంగ్రెస్కు అవకాశమిస్తే రైతు బతుకు మళ్లీ ఆగమవుతుంది. కరెంట్ కోతలు మొదలవుతాయి. ధరణి ఎత్తేస్తే రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. వాటి విలువ అమాంతం పడిపోతుంది. వలసలు మొదలై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడం ఖాయం. ఆలోచించకుండా ఓటేస్తే పదేండ్లకు ముందున్న పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన తలరాతను మార్చే ఓటును అభివృద్ధి చేసే వారికే వేయాలని సూచిస్తున్నారు.
కమ్మర్పల్లి, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని, ధరణి తీసేస్తామని ప్రకటించడంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. దశాబ్దాలుగా కూనరిల్లిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, విద్యుత్ను బాగు చేయడం. ధరణి పోర్టల్ తేవడం, సాగునీటి వనరులను పెంచడం ద్వారా సీఎం కేసీఆర్ బలోపేతం చేశారు. ధరణి వచ్చాక రైతుల భూములకు భద్రత లభించింది. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ భూములపై హక్కులు, బదిలీలు గంటలోనే జరిగిపోతున్నాయి. ఇలా భూములకు భద్రత లభించడంతో గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు వ్యవసాయ రంగ పరిస్థితి తెలియనిది కాదు. అస్తవ్యస్త కరెంటుతో రైతులు నానా తిప్పలు పడ్డారు. ఒకానొక దశలో రైతులు వ్యవసాయాన్ని వదిలేయడంతో భూముల ధరలు పడిపోయాయి. చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలస పోయారు.
పగలు 2 గంటలు, రాత్రి 3 గంటల కరెంటుతో పంటలు పూర్తిగా పండిన రోజులు ఉండకపోయేవి. ఒక మడి పారితే ఒక మడి ఎండిపోయేది. వ్యవసాయమే జీవనాధారమైన వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల పాటు కుంటుపడుతూ వచ్చింది. బోరుబావుల కింద సాగు జీవన్మరణ సమస్యగా ఉండేది. లోవోల్టేజీ కరెంట్తో వ్యవసాయ మోటర్లు, పంపుసెట్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం నిత్యం కనిపించేవి. దీంతో బోరుబావుల రైతులకు మోటర్ల మరమ్మతు ఖర్చులు పెనుభారంగా మారుతుండేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి మరమ్మతులకు వారాలు, నెల రోజులు పట్టేది. ఈ లోగా ఆ బోరుబావుల కింద పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఇలా బోరుబావుల కోసం ఉన్న భూములను అమ్ముకున్న దయనీయ ఉదంతాలు గ్రామాల్లో కనిపించేవి. మరమ్మతుల కోసం తమ భార్యల పుస్తెలను సైతం అమ్ముకుని అప్పుల పాలై గల్ఫ్ దేశాలకు వెళ్లే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లు, ధరణి ఎత్తివేయడంతో పాత రోజులే మళ్లీ పునరావృతం అవుతాయి. మళ్లీ రైతులు పొట్టకూటి కోసం వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామాలకు సాగునీటికి ఆధారమైన చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేయించడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి తిరిగి చెరువుల కింద ఆయకట్టు సస్యశ్యామలమయ్యింది. ఎన్నో చెరువుల కింద ఆయకట్టు ఒక పంట నుంచి రెండో పంట సాగుకు యోగ్యంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించడంతో బోరుబావులకు కరెంట్ సమస్య తీరిపోయింది. ఫలితంగా బోరుబావుల రైతులకు మరమ్మతుల కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పంటలు ఎండిపోయే దుస్థితి తప్పింది. ప్రాజెక్టులు, కాలువలు అటు కాళేశ్వరం జలాలతో, ఇటు స్థానిక వనరుల ఆధారంగా నిత్యం నిండుగా ఉండడంతో భూగర్భజలాలు సైతం పెరిగాయి. దీంతో బోరుబావులలో పుష్కలంగా నీళ్లు వస్తుండడంతో రెండు పంటలను చింత లేకుండా రైతు పండించుకోగలుగుతున్నాడు. దీంతో రైతుల ఆదాయం పెరిగి రైతు కుటుంబాలు ఆర్థికంగా మెరుగయ్యాయి. తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ బలపేతమైంది. పంటకు ముందు పెట్టుబడి సాయాన్ని అందించడమే కాకుండా పండిన తర్వాత ధాన్యాన్ని గ్రామాల్లోనే ప్రభుత్వమే కొనుగోలు చేసి 10 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు వేయడంతో వ్యవసాయాన్ని ఉత్సాహంగా చేసుకుంటున్నారు.
దీంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు రావడంతో అన్నదాతల్లో ఆర్థిక ధీమా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడడం, ధరణిని తీసివేస్తామనడం, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలనే ప్రకటనలు రైతుల్లో ఆందోళనను నింపుతున్నాయి. మళ్లీ పాత రోజులు వస్తాయనే భయం రైతుల్లో మొదలైంది. 3 గంటల కరెంట్ వస్తే మళ్లీ పంట పూర్తిగా పండే పరిస్థితి ఉండబోదని, ధరణిని తీసేస్తే భూములకు భద్రత కరువై విలువ పడిపోతుందని, 10 హెచ్పీ మోటర్లు కొనడానికి మళ్లీ రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సాగునీటిని, పంట పెట్టుబడిని అందిస్తూ, 24 గంటల కరెంట్ను ఇస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేసిన కేసీఆర్ రైతుకు మరింత మేలు చేసేందుకు రైతువేదికలు నిర్మించి ధాన్యం నిల్వకు భారీ గిడ్డంగులను నిర్మించి రైతుల్లో వ్యవసాయం పట్ల ఎంతో భరోసా పెంచారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ను ఎత్తివేసి ధరణి తీసేసి పాతపద్ధతిలో కాలమ్స్ను తెస్తే మళ్లీ దళారుల బారిన పడిపోతామనే చింత రైతుల్లో నెలకొంటున్నది. ఇదే జరిగితే మళ్లీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోతుంది. కేసీఆర్ వ్యవసాయం కోసం రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన కృషి వృథా అయిపోతుంది. తిరిగి గ్రామీణ వ్యవస్థ కుదేలవుతుంది. ఇటువంటి విశ్లేషణపైనే రైతుల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
డిచ్పల్లి, నవంబర్ 27: 2020లో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారానే ప్రస్తుత భూములు సేఫ్గా ఉంటాయి. లేదంటే వాటికి రక్షణ లేకుండా పోతుంది. ధరణి ద్వారా ఎవరి భూమి హక్కులు వారి సొంతంగా రక్షింపబడుతాయి. పాత విధానం తీసుకువస్తే పేద, మధ్యతరగతి వారి భూములకు రక్షణ లేకుండా పో తుంది. కబ్జాదారులు పెరిగిపోతారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు అన్యాయం చేసినట్లవుతుంది. ధరణి ఎత్తేస్తే రైతులు మళ్లీ ఇబ్బందులు పడుతారు. ధరణి పోర్టల్ తీసేస్తే రైతుబంధుకు ఇబ్బందులు ఎదురవుతాయి. కౌలుదారు కాలం భయంతో స్వయంగా వ్యవసాయం చేయలేని వారు భూమిని బీడు పెడతారు తప్పా కౌలుకు ఇచ్చే రిస్కు తీసుకునే పరిస్థితులు ఉండవు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో ధరణి ఎత్తివేసి భూమాత పేరుతో ప్రకటించిన భూ క్రమబద్ధీకరణకు శాస్త్రీయ విధివిధానాల్లో స్పష్టత లేదు. గతంలో మాదిరిగా పట్వారీ అజమాయిషీ పెరిగితే చిన్న, సన్నకారు రైతులకు భూమిపై భరోసా తగ్గుతుంది. రెవెన్యూ వ్యవస్థలో అనేక అక్రమాలకు తెర లేపినట్లు అవుతుంది. భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత లోపిస్తుంది. విద్యుత్ నాణ్యత విషయంలో, రైతులకు అందించే 24గంటల ఉచిత కరెంట్ అంశంలో రైతాంగం ఆందోళనలోనే ఉన్నారు. సరైన వ్యవసాయ విధి విధానాలు ప్రకటించకపోవడంతో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం లేకపోలేదు.
ప్రస్తుత ధరణి విధానంలో కొనసాగుతున్న భూముల పట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 2020లో తీసుకువచ్చిన ధరణి స్థానంలో పాత విధానం తెస్తే మళ్లీ రికార్డులు కొత్తగా రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే అది చాలా కష్టమైన పని, సుమారు 3 సంవత్సరాల రికార్డులు రాయడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇది అటు అధికార యంత్రాంగానికి ఇటు ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ధరణిని ముట్టుకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.