మెండోరా, సెప్టెంబర్ 4 : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈనెల ప్రారంభం నుంచి మహారాష్ట్రలోని గైక్వాడ్, నాసిక్, గోదావరి తీర పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద వచ్చి చేరుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు నీటి మట్టం భారీగా పెరిగింది. జూలై మొదటి వారంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతున్నప్పటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు.
ప్రాజెక్టు అధికారులు గోదావరిలోకి నీటి విడుదలను చేపట్టారు. ఎస్సారెస్పీ ఎగువన, దిగువన ఉన్న గ్రామాలు గోదావరి తీర ప్రాంత ప్రజలుముంపునకు గురి కాకుండా ప్రాజెక్టులో 86 టీఎంసీలు ఉండేలా నియంత్రించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రాజెక్టును గతంలో రెండుమార్లు సందర్శించి ఎస్సారెస్పీ ఎగువన, దిగువన ఉన్న గ్రామాలు ముంపునకు గురి కాకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సీజన్లో ఎటువంటి సమస్యలు లేకుండా వరద దిగువన ఉన్న బంగాళాఖాతంలోకి చేరిపోయింది.
ఈ క్రమంలో ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090.80 అడుగులకు చేరుకున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మరో రెండు నెలల వరకు వరద వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూసివేస్తారు. ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతాల నుంచి 62,710 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. రెండు రోజుల వ్యవధిలోనే 8 టీఎంసీల వరద వచ్చి చేరింది.
వరదగేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో అధికారుల ఆదేశానుసారం ఆదివారం సాయంత్రం ప్రాజెక్టు ఎనిమిది వరద గేట్లు ఎత్తి 24,960 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా అదే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని ప్రాజెక్టు నిండుకుండలా మారింది.