కంఠేశ్వర్, మే 2 : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ‘ఇంటి నుంచే ఓటు’ (ఓట్ ఫ్రం హోం) సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3 నుంచి 6 వరకు హోమ్ ఓటింగ్ నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజావ్గాంధీ హన్మంతు తెలిపారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1758 మంది ఓట్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.
వీరిలో 85 ఏండ్లకు పైబడి సీనియర్ సిటిజన్ ఓటర్లు 859, దివ్యాంగ ఓటర్లు 899 మంది ఉన్నారని తెలిపారు. ఈ మేరకు 50 హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటుచేసి ఓటు సేకరణ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన ఓటర్లు వారికి కేటాయించిన తేదీల్లో ఇంటివద్ద అందుబాటులో ఉంటూ ఓటు హక్కును వినియోగిచుకోవాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అత్యవసర విభాగాలకు చెందిన మరో 86 మంది సైతం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.