Justice Sri Sudha | నిజామాబాద్ లీగల్, జూన్ 17: స్త్రీ, పురుషుల్లో వచ్చే శారీరక మార్పులను మార్చలేమని, మారాల్సింది మనుషులేనని హైకోర్టు జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. పోస్టల్శాఖ ఎన్నో ప్రజాహిత బీమా పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని ఆర్థిక, ప్రమాద ప్రయోజనాలు పొందాలని సూచించారు. భారతీయ పురాతన చరిత్రలో ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక స్థానం ఉందని, వారిని అందరూ గౌరవ ప్రదంగా చూడాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ‘పోస్టల్ బీమా పథకాలు -వినియోగం’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మహాభారతంలో అర్జునుడు బృహన్నలగా మారి మహత్తర మార్పుకు మూల కారకుడైనట్లు తెలిపారు. ఇతిహాస చరిత్రనే మనకు ప్రామాణికం కావాలన్నారు. నేటి సమాజం లో జీవిస్తున్న కొందరు స్త్రీ, పురుషుల్లో వచ్చిన, వస్తున్న శారీరక సంబంధిత మార్పులు అంగీకరించాలని, మనతో సమానంగా వారిని చూడాలని కోరారు. ట్రాన్స్జెండర్లలో కూడా ప్రతిభావంతులైన వారు దేశాభివృద్ధిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొందరిని సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నాయని, వారిని మార్చడానికి న్యాయసేవా సంస్థ కృషి చేస్తున్నదని అన్నారు. చట్టాలు కల్పించిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్థికంగా చితికిన వారికి చేయూత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ ..దాతల సహకారంతో ఆర్థికంగా చితికిన వారికి చేయూతనందించి, పోస్టల్ బీమా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్ల అభ్యున్నతికి న్యాయసేవా సంస్థ కృషి చేస్తున్నదని, వారిలో పరివర్తన తేవడానికి శ్రమిస్తోందన్నారు. సదస్సు అనంతరం సెక్స్వర్కర్లు, ట్రాన్స్జెండర్లకు పోస్టల్ బీమా పథకాల సర్టిఫికెట్లను పోస్టల్శాఖ జనరల్ మేనేజర్ మదన్ మోహన్ కాందీతో కలిసి న్యాయమూర్తులు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు కనకదుర్గ, షౌకత్ జహాన్ సిద్ధిఖీ, రవికుమార్, శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జిలు నస్రీన్ సుల్తానా, శ్రీకాంత్బాబు, అజయ్ కుమార్ దేవన్, జూనియర్ సివిల్ జడ్జిలు దీప్తి, కుష్బు, ఉపాధ్యాయులు గోపీకృష్ణ, రుబీనా ఫాతిమా, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు పోలీస్ కమిషనర్ మధుసూదన్ రావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవీదాస్ చాందక్, ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ, ప్రధాన కార్యదర్శి బాగీచరణ్, న్యాయసేవా సంస్థ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ రాజ్కుమార్ సుబేదార్, ఉదయ కృష్ణ, ప్రమోద్, శుభం, మాణిక్ రాజు, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, పోస్టల్శాఖ అసిస్టెంట్ మేనేజర్ యవన్ పాల్గొన్నారు.