కామారెడ్డి, మార్చి 22: కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా న్యాయస్థాన భవనంలో నూతన 2వ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని (కోర్టును)వర్చువల్ పద్ధతిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ఎస్.ఎన్. శ్రీదేవి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్, శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. కోర్టులకు వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కక్షిదారుల్లో కలిగేలా న్యాయవ్యవస్థ పనిచేయాలన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా న్యాయస్థానాల ఏర్పాటు ఆవశ్యకత కూడా పెరుగుతుందని తెలిపారు.
కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలని, ఏండ్ల తరబడి పెండింగ్లో ఉండడం మంచిదికాదని అన్నారు. న్యాయ వ్యవస్థకు బార్, బెంచ్ రెండు చక్రాల్లాంటివని, అవి సక్రమంగా పని చేస్తేనే కేసులు సత్వర పరిష్కారమై కక్షిదారులకు న్యాయం చేకూర్చిన వారమవుతామన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తులు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టుహాలు, జడ్జి చాంబర్ను సందర్శించి పూజలు నిర్వహించారు. 2వ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం జడ్జిగా జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దీక్ష, జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీదేవి, సూపరింటెండెంట్ వెంకట్ రెడ్డి, శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, చంద్రసేనారెడ్డి, న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు.