నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 17: అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన భారీ వానకు పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో వరి ధాన్యంతోపాటు మామిడి, జామ కాయలు నేలరాలాయి. మక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు చేతికందే సమయంలో నష్టపోవడంతో రైతులు కంటతడిపెట్టారు. బీర్కూర్ మండలంలో 4831 ఎకరాలు, నస్రుల్లాబాద్ మండలంలో 2835 ఎకరాల వరి పంట దెబ్బతిన్నట్లు ఏవోలు కమల, నరేంద్ర తెలిపారు.
ఈదురు గాలులకు బీర్కూర్ శివారులోని ఓ రైస్మిల్ పైకప్పు ఎగిరిపోగా ధాన్యం బస్తాలు తడిసి సమారు రూ. కోటి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బీర్కూర్ మండల పరిధిలో దెబ్బతిన్న పంటలను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. బాన్సువాడ మండల పరిధిలో 350 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి సుధాకర్ తెలిపారు. మొత్తం 413 మంది రైతులకు చెందిన 238 ఎకరాల్లో వరి, 52 ఎకరాల్లో జొన్న, 60 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
దోమకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరిశీలించారు. సీఎంతో మాట్లాడి పంటలు నష్టపోయిన రైతులందరికీ సాయమందేలా చూస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. కామారెడ్డి రూరల్ మండలం చిన్నమల్లారెడ్డిలో పంటలను ఎమ్మెల్యే కాటిపల్లి పరిశీలించారు.
భిక్కనూరు మండలంలో వరి, మక్కజొన్న, బొప్పాయి, జామ పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ, వ్యవసాయ శాఖ అధికారి రాధారెడ్డి తదితరులు పరిశీలించారు. పలు గ్రామాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి.
దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు సరఫరాను పునరుద్ధురించేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. బీబీపేట్ మండలంలో రెండు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరి, మక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న, వరితోపాటు టమాట, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబెట్టిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది.
నిజాంసాగర్ మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి సింగీతం, తెల్గాపూర్ శివారులో జొన్న పంట నేలవాలింది. నిజాంసాగర్ మండలంలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏవో అమర్ప్రసాద్ తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 34 మి.మీ., బీర్కూర్లో 21 మి.మీ., నస్రుల్లాబాద్లో 18.5 మి.మీ., బొమ్మన్దేవ్పల్లిలో 15.5 మి.మీ., గాంధారి మండలం రామ్లక్ష్మణపల్లిలో 11 మి.మీ., మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 10.8 మి.మీ., పిట్లంలో 7.3మి.మీ., మద్నూర్ మండలం మెనూర్లో 7 మి.మీ., బిచ్కుంద మండలం పుల్కల్లో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పిట్లం మండలంలో రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి.
కాగా చేతికి వచ్చిన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి డోంగ్లీ మండలంలో జొన్న పంటకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వానకు జొన్న నేలకొరగడంతో కంకులను రైతులు ఆదివారం కోసి రోడ్డుపై ఆరబెట్టారు. కంకి తడవడంతో జొన్నలు నల్లగా మారుతాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సదాశివనగర్ మండలంలో ఈదురు గాలులకు పంట నష్టం జరిగిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.