భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు కృషితో మత్స్య సంపద దండిగా పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. నీటి ప్రవాహాలకు పెద్ద ఎత్తున చేపలు ఎదురెక్కుతూ వచ్చాయి. ఏ ఊరిలో చూసినా చేపల వేట కనిపించింది. మత్స్యకారులతో పాటు సాధారణ ప్రజలు సైతం నీటిలో దిగి చేపలు పట్టారు. ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా మత్స్యసిరి భారీగా పెరిగింది. ఫలితంగా ఎక్కడ చూసినా పుష్కలంగా జిమ్మల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇంటింటా చేపల కూర ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 29
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగింది. ఒకప్పుడు చేపలంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం..సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మత్స్యరంగానికి ఊపిరివచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులునిండాయి. సర్కారు తీసుకున్న చర్యలతో నీలివిప్లవం సాధ్యమయ్యింది. చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో ప్రస్తుతం మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండడంతో మత్స్యకారులకు చేపలు సిరులు కురిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువుల వద్ద మత్స్యకారులు జోరుగా చేపలు పడుతున్నారు. చేపలు తాజాగా లభిస్తుండడంతో కొనుగోలుకు ప్రజలు పోటీపడుతున్నారు. రౌట, బొచ్చ, కొర్రమీను తదితర రకాల చేపలు కిలో రూ.80 నుంచి రూ.300 చొప్పున చెరువుల వద్దే విక్రయిస్తున్నారు.
ఎల్లారెడ్డి, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీతో ఎక్కడ చూసినా చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఐదు వందలు పలికే కొరమీను సైతం ఎల్లారెడ్డిలో మూడు వందల రూపాయలకే కిలో లభిస్తున్నాయి. మిగతా రకాలైన రౌట, బొచ్చ, బంగారు తీగలు సైతం రూ.100కే లభించడం విశేషం. వర్షాలు దండిగా కురవడంతో చెరువుల నుంచి ఎదురెక్కిన చేపలను జాలర్లు సులభంగా పట్టి క్వింటాళ్ల కొద్ది చేపలు మార్కెట్కు తరలిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు నిండడంతో చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఎల్లారెడ్డిలోని చేపల మార్కెట్లో కొనుగోలుదారుల సందడి కనిపించింది. టమాట ధర కన్నా తక్కువకే చేపలు దొరకడం చాలా అరుదుగా పేర్కొన్నారు. చికెన్ కిలో రూ.260, టమాట కిలో రూ.120 ఉండగా చేపలు కేవలం వంద రూపాయలకే లభించడం విశేషం.
కామారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ)/ కామారెడ్డి, జూలై 29 : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలవారితోపాటు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. వరుసగా కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు పొంగిపొర్లాయి. దీంతో భారీ చేపలు చెరువుల్లోకి ఎదురెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపపిల్లలను ఉచితంగా చెరువులు, జలాశయాల్లో వదలడంతో ఇప్పుడా చేపలు పెద్దగా తయారై మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించడంతో భారీగా వర్షపు నీరు చేరి నిండుకుండలా మారాయి. గతంలో వివిధ రాష్ర్టాల నుంచి చేపలను దిగుమతి చేసుకొని విక్రయించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపపిల్లలను చెరువుల్లో వదలడంతో ప్రస్తుతం అవి పెద్దవై ఉపాధినిస్తున్నాయి.
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలోని 637 చెరువులు, రెండు రిజర్వాయర్లలో 25 కోట్ల 34లక్షల చేప పిల్లలు, కోటీ 44 లక్షల రొయ్య పిల్లలను వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం విడుదల చేసింది. అందుకు రూ.24.56కోట్లు వెచ్చించారు. నేటి వరకు జిల్లాలో 11,300 టన్నుల చేపలు ఉత్పత్తి కాగా ప్రస్తుతం 18,200 టన్నులకు పెరిగింది. ఒకప్పుడు చేపలు రూ.200కిలో లభించగా ప్రస్తుతం రూ.60 నుంచి 150 చొప్పున లభిస్తున్నాయి.
పది రోజులుగా భారీ వర్షాలు కురువడంతో కామారెడ్డి చెరువులో గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చేపల పిల్లలు ఎదిగాయి. పెద్దపెద్ద సైజు చేపలు లభిస్తుండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి మంచి దిగుబడి వచ్చింది.
-అవగళ్ల శ్రీనివాస్, మత్స్యకారుడు, కామారెడ్డి
గతంలో చేపలను ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేవాళ్లం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే చేపపిల్లలను ఉచితంగా చెరువులో వదలడం.. అవి ఇప్పుడు ఎదిగి భారీ సైజుల్లో లభ్యమవుతున్నాయి. చేపలు విక్రయించడంతో మా జీవనోపాధి మెరుగైంది. మాపాలిట దేవుడు కేసీఆర్.ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-సుధీర్, మత్స్యకారుడు, కామారెడ్డి
వరుసగా కురిసిన వర్షాలతో చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో పెద్దపెద్ద చేపలను మత్య్సకారులు వలలతో ఒడ్డునే పట్టుకొని విక్రయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువు అలుగు పారడంతో దాన్ని చూసేందుకు వచ్చిన వారు.. సమీపంలోనే చేపలు విక్రయిస్తుండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపారు. మార్కెట్కు వెళ్లకుండా చేపలు పట్టినచోటే అమ్ముడు పోవడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎలాంటి దళారులూ లేకుండా చెరువుల వద్ద చేపలను పట్టుకొని అమ్ముకుంటున్నారు. మార్కెట్లో కన్నా తక్కువ ధర ఉండడం, నిలువ లేకుండా అప్పటికప్పుడు పట్టిన చేపలు కావడంతో చాలామంది కొనడానికి పోటీ పడుతున్నారు. దీంతో చెరువును చూసేందుకు వచ్చిన వారి కన్నా చేపలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. మార్కెట్లో కిలో చేపలు రూ.150 అమ్ముతుండగా, చెరువు వద్ద రూ.100కే కిలో విక్రయిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. పది రోజులుగా భారీ వర్షం పడడంతో పెద్దపెద్ద చేపలను ఒడ్డునే పట్టాం. రూ.100కు కిలో అమ్ముతున్నాం. చెరువును చూసేందుకు వచ్చిన వారు మార్కెట్కు వెళ్లకుండా ఇక్కడే చేపలను కొంటున్నారు.
-స్వామి, మత్స్యకారుడు, కామారెడ్డి
సదాశివనగర్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పటిష్టపరచడంతోపాటు ఉచితంగా చేపపిల్లలను విడుదల చేయడంతో గంగపుత్రులు ఆర్థికంగా మెరుగవుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం విడుదల చేసిన చేపపిల్లలు పెద్దవి కావడం, ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువు అలుగు ద్వారా ఎదురెక్కిన చేపలను గంగపుత్రులు పట్టుకొని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామాల్లో జోరుగా చేపలు విక్రయిస్తున్నారు. అలుగుల వద్ద వలలతో పట్టుకొని కిలో చేపలు రూ. 80కే అమ్ముతున్నారు