కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు
అత్యధికంగా కామారెడ్డిలో 112.4మి.మీటర్ల వర్షపాతం నమోదు
సాగులో అన్నదాతలు బిజీబిజీ
కామారెడ్డి, జూలై 4: కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొండ, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నస్రుల్లాబాద్ మండలంలో సాధారణ స్థాయి కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి, రామారెడ్డి, బిచ్కుంద, లింగంపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షాలు కురిశాయి. రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు ప్రవహిస్తున్నాయి. గాంధారి, లింగంపేట వాగులు జలకళను సంతరించుకున్నాయి. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ వాగు నుంచి మానేరుకు వరద కొనసాగుతున్నది.
చెరువుల్లోకి వరద..
లింగంపేట/నస్రుల్లాబాద్, జూలై 4: లింగంపే ట మండలంలో ఆదివారం రాత్రి భారీవర్షం కురిసింది. నాగారం గ్రామ శివారులోని కాసులకత్త వ ద్ద వరద ప్రవహిస్తుంది. భవానీపేట, మెంగారం, లింగంపేట, లింగంపల్లి, ముంబాజీపేట, మోతె, పోల్కంపేట, బాణాపూర్, కోమట్పల్లి, పోతాయిపల్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లోకి వర్షపు నీరు వస్తున్నది.
నస్రుల్లాబాద్లో..
ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అంకోల్, నెమ్లి వాగులు ప్రవహించాయి. మండలంలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎస్వో తెలిపారు.
ముమ్మరంగా సాగు పనులు..
వానలు విస్తారంగా కురుస్తుండడంతో అన్నదాతలు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. పలు మండలాల్లో వరినాట్లు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన మక్కజొన్న మొలకెత్తడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 5,36,903 ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదించారు.
కళ్యాణి ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..
నిజాంసాగర్లో 7సెం.మీల వర్షం
పొంగిపొర్లుతున్న వాగులు
నిజాంసాగర్, జూలై 4: నిజాంసాగర్ మండలంలో ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురిసింది. మండలంలో 77 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50మీటర్లకు 409.00 మీటర్లతో ఉండగా ఎగువ భాగం నుంచి 200 క్యూసెక్కుల వరద వస్తుండడంతో అంతే స్థాయిలో రెండు గేట్ల ద్వారా నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ఇక సింగీతం మత్తడి పొంగిపొర్లుతున్నది. ప్రాజెక్టులోకి 300 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి నాగమడుగులోకి వరద వచ్చి చేరుతుండగా పంట పొలాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగుల(17.80 టీఎంసీల)కు సోమవారం సాయంత్రానికి 1392.24అడుగులు (5.11 టీఎంసీల) నీరు నిల్వ ఉండగా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు 1205 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోచారంలోకి ఇన్ఫ్లో..
నాగిరెడ్డిపేట్, జూలై 4: నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ప్రాజెక్టులోకి 6237 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21అడుగులు కాగా ప్రస్తుతం 12.5 అడుగుల మేర నీరు ఉన్నట్లు డీఈఈ తెలిపారు.