బాన్సువాడ, జనవరి 19 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి కంటి పరీక్షలు చేయించుకొన్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి కంటి వెలుగులో అందించే అద్దాలు, మందులు, పరీక్షించే విధానంపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కంటి చూపులేని జీవితం అంధకారమన్నారు. ఆర్థికంగా ఉన్నవారు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకొనివస్తారని, కానీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఖర్చుతో కూడుకున్నదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పల్లెల్లోనే కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పరీక్షలు చేసి, ఉచితంగా కళ్లద్దాలు కూడా అందిస్తున్నదని తెలిపారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. బుధవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన పంజా బ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు కంటి వెలుగు కార్యక్రమాన్ని అభినందించారని గుర్తుచేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పట్టణాలతోపాటు ప్రతిగ్రామంలో వందరోజులపాటు వైద్య బృందాలు తిరుగుతూ నేత్ర పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు. జిల్లాలోని 22 మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి 44 వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తాయని వివరించారు. దృష్టిలోపం ఎక్కువ ఉన్నవారికి వారం రోజుల్లో వారి ఇండ్లకే కళ్లద్దాలను పంపిస్తారని తెలిపారు.
ప్రతి మనిషికీ హెల్ ్తప్రొఫైల్
సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారుచేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే ములుగు, రాజన్న సిరిసిల్ల నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారని, సత్ఫలితాలు వచ్చి విజయవంతమైనట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, గాలి, భోజనం బాగుంటే రోగాలు దరిచేరవని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా మనిషిలో ఉన్న లోపాలను తెలుసుకొని సవరించుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమాన్ని కేవలం బాన్సువాడలో మాత్రమే అమలుచేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కంటి వెలుగు ను విజయవంతం చేయాలి:కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేసుకున్న వారికి అవసరం మేరకు కళ్లద్దాలను అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రాం జిల్లా నోడల్ అధికారి సూర్యశ్రీ, డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ సింగ్, ట్రైనీ కలెక్టర్ ప్రతాప్, ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైద్యాధికారులు శ్రీనివాస్ ప్రసాద్, విజయమహాలక్ష్మి, అపర్ణ, శ్రీప్రియ, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి,ఆర్యవైశ్యసంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, మహ్మద్ ఎజాస్, అలీమొద్దీన్ బాబా, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, ఆర్పీలు, ప్రజలు పాల్గొన్నారు.