మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లక్కోరాలో నిర్వహించిన మెగాజాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 4500 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,236 మందికి కొలువులు లభించాయి. ఎంపికైన వారికి మంత్రి వేముల నియామక పత్రాలు అందజేశారు.
– వేల్పూర్, సెప్టెంబర్ 12
వేల్పూర్, సెప్టెంబర్ 12: నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్మేళా నిర్వహించామని, ఇక ముందూ నిర్వహిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం లక్కోర ఏఎన్జీ ఫంక్షన్హాల్లో బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మంగళవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. జాబ్మేళాకు నియోజకవర్గ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఉద్యోగం కోసం తమ చిన్నారులతో వచ్చి మహిళలు జాబ్మేళా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. 70కి పైగా కంపెనీలు ఈ జాబ్మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించగా ఎంపికైన పలువురు అభ్యర్థులకు అక్కడికక్కడే ఆయా కంపెనీల ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిగా అయ్యాను.. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేశా.. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్మేళా చేపట్టానన్నారు. ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేసిన పనికాదని, రాజకీయాలకతీతంగా జాబ్మేళా ఉంటుందన్నారు. ఇలాంటి జాబ్మేళాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జాబ్మేళాకు యువత పెద్దసంఖ్యలో తరలివచ్చి సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
ఇప్పటికే న్యాక్ ద్వారా 12వేల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించామని వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు. మంత్రి కేటీఆర్ కృషితో యువత కోసం రాష్ట్రంలో 9లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, తల్లిదండ్రులు గర్వపడేలా యువత ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. ఆసరా ఫౌండేషన్ సౌజన్యంతో జాబ్మేళా నిర్వహించామని, 5,500 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 4వేల పైచిలుకు జాబ్మేళాకు హాజరైనట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయన్నారు. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ వారు ఇంటర్వ్యూ చేసిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారని, భవిష్యత్తులో కూడా యువత కోసం జాబ్మేళా నిర్వహిస్తామని, ఇది ఇలాగే కొనసాగుతుందని మంత్రి వేముల వివరించారు.
ఉద్యోగాలకు ఎంపికైన యువతీయువకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాబ్మేళాలో 4300మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా 1,236 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 751 మందికి జాబ్మేళా వద్ద అపాయింట్మెంట్ లెటర్ అందజేయగా, మిగతా 485 మంది రెండు రోజుల్లో హైదరాబాద్లోని ఆయా కంపెనీల ఆఫర్ లెటర్లు అందుకోనున్నారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, రైతు నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసరా ఫౌండేషన్ శివశంకర్, జాబ్మేళా కోఆర్డినేటర్ చందర్ పాల్గొన్నారు.
ఎంత దూరమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ప్రారంభంలో చిన్నస్థాయి నుంచి వచ్చినవారే ఉంటారు. నేను 1990లో రూ.800 జీతానికి చేరి 1994లో రూ.16వేల జీతానికి చేరుకున్నాను. హైదరాబాద్లో అప్పట్లో అదే హైయ్యెస్ట్ సాలరీ. మనం గమ్యం చేరాలంటే ప్రయత్నం చేయాల్సిందే.
మంత్రి వేముల ప్రశాంతన్న నిర్వహించిన మెగా జాబ్మేళా నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది. నాకు హైదరాబాద్లోని మెట్రోటెక్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రూ.15వేల వేతనంతో వచ్చిన ఈ ఉద్యోగంతో సమీప భవిష్యత్తులోనే మరింత ముందుకు వెళ్లే అవకాశం కలిగింది. నాకు ఉపాధిని కల్పించిన మంత్రికి రుణపడి ఉంటాను.
-ఎం.రక్షిత్, నాగంపేట్, ముప్కాల్ మండలం
ఏ పనిచేసినా పర్ఫెక్షన్తో చేసే పేరున్న ప్రశాంతన్న బాల్కొండ యువత కోసం జాబ్మేళా పెట్టారని తెలియగానే వచ్చాను. నాకు హైదరాబాద్లో మెడ్ప్లస్లో ఈఎస్ఆర్గా రూ.12వేలతో ఉద్యోగం వచ్చింది. ఎం.ఫార్మసీ చదువుకున్న నాకు మంత్రి నిర్వహించిన జాబ్మేళా తొలిమెట్టు ఎక్కించింది. మంత్రికి ధన్యవాదాలు. కంపెనీల ప్రతినిధులు యువతతో ఇంటరాక్షన్లో చక్కని మెసేజ్, మోటివేషన్ ఇచ్చారు.
-సంధ్యారాణి, కమ్మర్పల్లి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాబ్మేళా నిర్వహించి ఎందరో యువతి, యువకులకు ఉపాధి మార్గం చూపించారు. నాకు హైదరాబాద్లోని ఎంపవర్మెంట్ కంపెనీలో ప్రొడక్షన్ ఆపరేటర్గా ఉద్యోగం లభించింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. ఉద్యోగం కోసం హైదరాబాద్, ఇతర పట్టణాల్లో వెతికితే నెలల సమయం పడుతుంది. ఏ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు. అలాంటి అయోమయం లేకుండా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని 70 కంపెనీలను ఇక్కడికే తేవడంతో ఉద్యోగం లభించే అవకాశం కలిగింది. మంత్రికి కృతజ్ఞతలు.
– గోమాకుల పూజిత, ఆర్మూర్
మెగా జాబ్మేళాతో నా కూతురికి టీమ్ లీజ్ సర్వీసెస్లో ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగ యువతీయువకుల తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకొని పెద్ద మనసుతో మంత్రి ప్రశాంత్రెడ్డి జాబ్మేళా చేపట్టారు. ఈ జాబ్మేళా యజ్ఞం ఇంతటితో ముగియదని.. ము న్ముందు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించడం హర్షణీయం. మంత్రి వేములకు ధన్యవాదాలు.
-భూమేశ్వర్, వడ్యాట్, మోర్తాడ్ మండలం
మంత్రి ప్రశాంతన్న ప్రత్యేక శ్రద్ధతో వివిధ రంగాల కంపెనీలను మా చెంతకే తీసుకురావడం అభినందనీయం. జాబ్మేళాలో నాకు ఉద్యోగం వచ్చింది. బాల్కొండ నియోజకవర్గంలో యువతకు ఇంత భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే వేదిక, కార్యక్రమం ఇంత వరకు జరగలేదు. మంత్రి వేముల మాత్రమే చొరవ తీసుకొని మెగాజాబ్ మేళా నిర్వహించడం మా అదృష్టం. మంత్రిని బాల్కొండ యువత మర్చిపోలేరు.
-వంశీ, జాన్కంపేట్, వేల్పూర్ మండలం
బాల్కొండ యువత కోసం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పడుతున్న తపన చూశాం. యువతకు ఉద్యోగాలు రావాలని, జాబ్మేళా లక్ష్యం సాధించాలని తీవ్రంగా కృషి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా మంత్రి చూపిన చొరవ బాగున్నది. యువతకు ఉద్యోగం, ఉపాధి కోసం మంత్రి పట్టుదలగా ఉన్నారు. ఇక్కడి యువతకు మరెన్నో అవకాశాలు రావడం ఖాయం.
-చందర్, జాబ్మేళా కోఆర్డినేటర్