ఖలీల్వాడి, అక్టోబర్ 31 : ఎన్నికల్లో బూత్ కార్యకర్తలది కీలకపాత్ర అన్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. జిల్లాకేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో జరిగిందని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికీ ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇస్తామని అన్నారు. ప్రత్యేక వాటర్ ఫీడర్ లైన్ను ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. నగరంలో సమీకృత కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం, యువతకు ఉద్యోగాల కోసం ఐటీ హబ్ నిర్మించడంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. జిల్లాకేంద్రంలోని రైల్వేకమాన్ వద్ద రూ.25 కోట్లతో ఆర్యూబీ నిర్మించి వర్షపు నీరు నిల్వకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌమ్యుడిగా పేరుపొందిన ప్రభాకర్ రెడ్డిపై దాడి సిగ్గుచేటని అన్నారు. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ శాంతియుతంగా పోరాటం చేశారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతియుత పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త సిట్టింగ్ ఎంపీ మీద దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో పోరాడాలి తప్ప.. ఇలా హత్యా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఖలీల్వాడి, అక్టోబర్ 31 : నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నగరంలోని 26 డివిజన్ (కోటగల్లీ, దోబీగల్లీ, చంద్రానగర్, రోటరీనగర్, వివేకానంద కాలనీల్లో ఆయన కార్యకర్తలతో కలిసి మంగళవారం విస్తృత ప్రచారం చేశారు. బిగాలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. నగరంలో తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ సిర్ప సువర్ణ, 7వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.