పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. కార్పొరేట్ స్థాయి హంగులతో ఏర్పాటైన ఈ విద్యాసంస్థలు.. బడుగు జీవులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యాబోధన, అద్భుతమైన వసతుల కల్పన, క్రీడలతో పాటు వివిధ అంశాల్లో ఉత్తమ శిక్షణకు ఇవి కేరాఫ్ అడ్రస్గా మారాయి. చదువుతోనే బడుగుల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్.. విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేజీ టు పీజీ మిషన్లో భాగంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టిన ప్రభుత్వం.. ఎనిమిదేండ్లలో ఉమ్మడి జిల్లాలో వందకు పైగా గురుకులాలను ప్రారంభించింది. పాఠశాల విద్యతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలలు సైతం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బడుగు వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేసింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షకు పైగా వెచ్చిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నది.
నిజామాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేజీ టు పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చింది. గురుకుల విద్యాలయాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో నాంది పలుకుతున్నది. ఉచిత కాన్వెంట్ విద్యతో పాటు నాణ్యమైన భోజన, వసతి సదుపాయాలను అందిస్తోంది. సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణలో ఈ గురుకుల విద్యాలయాలన్నీ నూతన విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ స్థాయి హంగులతో ఏర్పాటైన ప్రభుత్వ గురుకుల విద్యాలయాలతో పేద వర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యింది. గడిచిన ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక కార్యక్రమాలను అమల్లోకి తెచ్చా రు. ఇందులో గురుకుల విద్యాలయాలు ఆశించిన ప్రగతితో జయకేతనం ఎగురవేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు వందకు పైగా గురుకులాలు ఏర్పాటుకావడంతో వేలాది మంది పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూరుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో 2017లో 5 మహాత్మా జ్యో తిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలను ఏర్పాటు చేశారు. ఇందులో 2 బాలికల కోసం, 3 బాలుర కోసం కేటాయించారు. 2019-20 విద్యా సంవత్సరంలో మరో 6 కొత్త గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 4 బాలికలకు, 2 బాలుర కోసం కేటాయించి ప్రారంభించారు. బీసీ గురుకులాలు మొత్తం 11 కొత్తవి ఏర్పాటయ్యా యి. నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు మొత్తం 19 ఏర్పాటయ్యా యి. ఇందులో 12 పాఠశాలలను కళాశాల స్థాయికి అప్గ్రేడ్ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాలు మొత్తం 11 ఉన్నాయి. ఇందులో సగం పాతవి ఉండగా మిగిలివి తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటైనవి ఉన్నాయి. ఇక గిరిజన గురుకుల పాఠశాలలు 8 నెలకొన్నాయి. ఇందులో బాలికల గురుకుల పాఠశాలలు 6, బాలుర గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి. ఇందులో 2720 మందికి లబ్ధి చేకూరుతున్నది. గిరిజన జూనియర్ కళాశాలలు 3, ఒకటి డిగ్రీ కళాశాల సైతం ఏర్పాటైంది.
కామారెడ్డి జిల్లాలో మైనార్టీ గురుకులాలు 9 ఉండగా ఇందులో బాలికలకు 3, బాలురకు 6 చొప్పున ఏర్పాటయ్యాయి. ఒకటి జూనియర్ కళాశాల సైతం నడుస్తున్నది. గిరిజన గురుకుల పాఠశాలలు 8 ఉండగా ఇందులో 6 బాలికల కోసం, 2 బాలుర కోసం కొనసాగుతున్నాయి. అదనంగా 3 గిరిజన జూనియర్ కళాశాలలు, ఒక గిరిజన డిగ్రీ కళాశాల ఉన్నది. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు 7 ఏర్పాటయ్యాయి. 3 బాలికల కోసం, 4 బాలుర కోసం విద్యను అందిస్తున్నాయి. ఎస్సీ గురుకులాలు 12 ఉన్నాయి. వీటి పరిధిలో 6,936 మందికి విద్యా బోధన అందుతున్నది. ఇవే కాకుండా ఇప్పటికే నెలకొల్పబడిన ఆయా విద్యాలయాల్లో ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో కొత్త కోర్సులను సైతం ప్రభుత్వం మంజూరు చేసింది.
ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన నిర్ణీత మెనూ ప్రకారం ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ రోజూ ఒక గుడ్డు, ఒక పండుతో పాటు ప్రతి నెలా నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్తో కూడిన ఆహారం అందిస్తున్నారు. కాస్మోటిక్స్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.115, బాలికలకు రూ.125 చొప్పున పంపిణీ చేస్తున్నారు. మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక కార్పెట్, ఒక బెడ్ షీట్, రెండు జతల బూట్లు, సాక్సులను ప్రతి విద్యార్థికీ అందిస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, కావాల్సిన వారికి తరగతులను బట్టి నోట్ బుక్స్ సైతం ఇస్తున్నారు.
గురుకుల పాఠశాలల్లో పాఠ్యంశాలే కాకుండా సైన్స్ ఫేర్, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ, సందేహ నివృత్తితో కూడిన అభ్యాసనం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరేందుకు సాయం కాలంలో బోధనా తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ. సన్నబియ్యంతో పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో నెయ్యితో పాటు పచ్చడి అందిస్తున్నారు. పెట్టె, పల్లెం, గ్లాసు, గిన్నె, చెంచా, పరీక్ష ప్యాడ్, డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిళ్లను ప్రవేశ సమయంలోనే ప్రభుత్వం అందిస్తున్నది. ఇలా ప్రభుత్వ గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ సౌకర్యాల రూపంలో రూ.లక్ష వరకు సర్కారు వెచ్చిస్తోంది.
బాన్సువాడ రూరల్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో కల్పించింది. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ గురుకులాలను బలోపేతం చేసి విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
-అహానాబేగం, ఆరోతరగతి. మైనార్టీ గురుకుల పాఠశాల బోర్లం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలతోనే నాలాంటి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతున్నది. పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించి మంచి ఆంగ్ల విద్యను అందిస్తున్నారు.
-రిమ్సాబేగం, 8వ తరగతి మైనార్టీ గురుకుల పాఠశాల బోర్లం.
ప్రతి పేద విద్యార్థికీ ఇంగ్లిష్ విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు.ప్రభుత్వానికి, కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– షిరీన్బేగం, బైపీసీ మొదటి సంవత్సరం.
మైనార్టీ గురుకుల కళాశాల, బోర్లం.
పాఠశాల భవనంలో వసతులు బాగున్నాయి. గతంలో బాన్సువాడలో ఉన్నప్పుడు ఇరుకు గదుల్లో ఉండే వాళ్లం. స్పీకర్ సార్ చొరవతో ప్రభుత్వం భవనం నిర్మించింది. ఇందులో హాయిగా చదువుకుంటున్నాం.
-దినేశ్, 9వ తరగతి గిరిజన గురుకుల బాలుర పాఠశాల, నస్రుల్లాబాద్.
నస్రుల్లాబాద్ : గిరిజన గురుకుల పాఠశాలలో భోజనం రుచికరంగా ఉంటుంది. ఇంటి వద్ద ఒక కూరతో మాత్రమే తినేవాళ్లం. కానీ హాస్టల్లో చేరిన నాటి నుంచి ఉదయం, మధ్యాహ్నం సాయంత్రం మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు.
-సాయి కిరణ్, 6వ తరగతి గిరిజన
గురుకుల బాలుర పాఠశాల, నస్రుల్లాబాద్.
ఆట పాటలతో చదువుకుంటున్నాం. ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందిస్తారు. ఆటల కోసం ప్రత్యేకంగా క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఇంటికి వెళ్లాలని అనిపించదు. అన్ని వసతులు బాగున్నాయి.
-కార్తీక్, 5వ తరగతి గిరిజన
గురుకుల బాలుర పాఠశాల, నస్రుల్లాబాద్.
ఇంతకాలం ప్రైవేటు పాఠశాలలో చదివాను. వాటికి ఏ మాత్రం తీసి పోని విధంగా చదువు చెబుతున్నారు. ఉచిత భోజనం, విద్య, వసతి ఉండడం సంతోషకరంగా ఉంది. విశాలమైన హాస్టల్ భవనంలో ఎటువంటి ఇబ్బందులు లేవు.
-మణివర్ధన్ గౌడ్, 5వ తరగతి
గిరిజన గురుకుల బాలుర పాఠశాల, నస్రుల్లాబాద్.