కామారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వంద శాతం సబ్సిడీతో రూ.3 లక్షలను అందించే ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ విడుతల వారీగా రూ. మూడు లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 10 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జోరుగా సాగింది. ప్రభుత్వ స్థలాలు, కొనుగోలు చేసిన స్థలాల్లో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి పేదలకు పంచిపెట్టారు. తాజాగా గృహలక్ష్మి పథకం ద్వారా ఖాళీ స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలను అందించనుండడంతో నిరుపేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటిని నిర్మించుకొనేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇల్లు లేకుండా.. సొంత స్థలం ఉన్న వారు ఇంటి నిర్మాణం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలను వంద శాతం సబ్సిడీతో అందజేస్తున్నది. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవడానికి మార్గదర్శకాలను జారీచేసింది. ఆఫ్లైన్లో కలెక్టరేట్, మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులను నేరుగా అందించాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలు ఇవీ..
రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మహిళల పేరిట ఖాళీ స్థలం ఉన్న వారు మాత్రమే గృహలక్ష్మి పథకానికి అర్హులు. రెండు రూములు, ఆర్సీసీ నిర్మాణం కలిగి ఉండి, ఇష్టం వచ్చిన డిజైన్లో ఇల్లు నిర్మించుకోవచ్చు. సంబంధిత దరఖాస్తుదారుకు ఆహార భద్రత కార్డు ఉండాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డుతో పాటు ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్లను దరఖాస్తుతో పాటు జతపర్చాలి. దరఖాస్తులను ప్రజాప్రతినిధుల ద్వారా లేదా లబ్ధిదారులు నేరుగా ఆఫ్లైన్ పద్ధతిలో అందజేయాలి.
ఎంపిక విధానం ఇలా ..
గ్రామాలు, పట్టణాల వారీగా వచ్చే దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నోడల్ అధికారులను నియమిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించారు. ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇండ్లను కేటాయిస్తారు. అర్హులైన వారి జాబితా శాశ్వత ప్రాతిపదికన (వెయిటింగ్ లిస్ట్) తయారు చేస్తారు. రూ.3 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లో మూడు విడుతలుగా అంటే బేస్మిట్ లెవల్, స్లాబ్ లెవల్, కంప్లీట్ లెవల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తారు. గృహలక్ష్మి కోసం వెబ్పోర్టల్ను ఏర్పాటు చేస్తారు.
జిల్లాలో ఇప్పటికే 8,713 డబుల్ బెడ్రూం ఇండ్లు..
సీఎం కేసీఆర్ ఎన్నికలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. వీటి నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా రూ.782 కోట్లతో 15,694 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించగా, 8,713 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 10,817 ఇండ్లు మంజూరవగా, 6851 (మూడు మండలాలు) ఇండ్లు పూర్తయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ఇక్కడ రాష్ట్రంలో అధికంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇప్పటికే సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 9వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. జుక్కల్లో 1,466 మంజూరు కాగా 189 ఇండ్లు, కామారెడ్డిలో 1,715 మంజూరవగా 1,497 ఇండ్లు, ఎల్లారెడ్డిలో 1,696 మంజూరవగా 176 ఇండ్లు పూర్తయ్యాయి.
అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి
గృహలక్ష్మి పథకానికి అర్హులైన వారు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇల్లు లేకుండా సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశాం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకొంటే, వారిని ఎంపిక చేస్తారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
-జీవన్, మున్సిపల్ కమిషనర్, ఎల్లారెడ్డి